ఎఫ్ఏ-1 ఆధారంగానే కేటాయింపు
20 మార్కులనే 100కు లెక్కింపు
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వు
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పదోతరగతి విద్యార్థులందరినీ పాస్చేస్తూ నిర్ణయం తీసుకొన్న ప్రభుత్వం, విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజుల్లో గ్రేడ్లు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లోని 5,21,392 మంది విద్యార్థులు పరీక్షల్లేకుండానే ఉత్తీర్ణులయ్యారు. ప్రక్రియనంతా పూర్తిచేసి, వారం రోజుల్లో గ్రేడ్లు ప్రకటిస్తామని ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ అనుసరించే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఫార్ములా ప్రకారం ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇంటర్నల్ మార్కులతోపాటు ఉపాధ్యాయులు వేసే మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడించేందుకు ఇటీవల సీబీఎస్ఈ మార్గదర్శకాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు మార్కులు వేసే విధానం అమల్లో లేకపోవడం, రాష్ట్రంలో ఒక్క ఎఫ్ఏ-1ను మాత్రమే నిర్వహించడంతో వాటినే ప్రామాణికంగా తీసుకొని ఫలితాలు ప్రకటించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తాయని వెల్లడించారు.