దేవరకొండ, జూన్ 4 : ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం విత్తనాల డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
లైసెన్స్ లేకుండా విక్రయించొద్దు : సీఐ
మాల్ : రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని, లైసెన్స్ లేకుండా విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని నాంపల్లి సీఐ సత్యం హెచ్చరించారు. శుక్రవారం చింతపల్లి మండలం మాల్ పట్టణంలోని యాదయ్య గార్డెన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, డీలర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కంపెనీలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వ్యాపారులు తమ దుకాణాల్లో ఉంచాలని సూచించారు. అంతకుముందు సీఐతోపాటు వ్యవసాయశాఖ అధికారులు పట్టణంలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్రావు, ఏఓ రామలింగేశ్వర్రావు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
దామరచర్ల: మండల వ్యవసాయ అధికారి బి. కళ్యాణ్చక్రవర్తి వాడపల్లి ఎస్ఐ విజయ్కుమార్తో కలిసి శుక్రవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో ఉన్న నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తనాలను ఎమ్మార్పీకే అమ్మాలని, రైతులకు రసీదు ఇవ్వాలని ఆదేశించారు.
డీలర్ల వద్దే కొనాలి : ఎస్ఐ
హాలియా : కొందరు దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారని, రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని హాలియా ఎస్ఐ శివకుమార్ సూచించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అటువంటి వారి వివరాలు పోలీసులకు తెలుపాలని కోరారు.
రైతులను మోసం చేస్తే చర్యలు : ఏఓ
మిర్యాలగూడ : విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించే సమయంలో నకిలీవి అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించేది లేదని ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ ఆగ్రోఫామ్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానకాలం సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అందుబాటులో ఉంచిందన్నారు. టౌన్, రూరల్ సీఐలు సాదా నాగరాజు, సత్యనారాయణ మాట్లాడుతూ నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ సుధీర్కుమార్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తెడ్ల జవహర్ బాబు, ఆలంపల్లి శ్రీనివాస్, అశోక్రెడ్డి, వాసు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
పెద్దఅడిశర్లపల్లి : ఫర్టిలైజర్ షాపుల యజమానులు విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని గుడిపల్లి ఎస్ఐ వీరబాబు, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఫరిలైజర్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఏఓ పాండునాయక్, ఏఈఓ రాకేశ్ పాల్గొన్నారు.