హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): గురువింద గింజకు తన కింద నలుపు తెలియదని సామెత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితీ అలా నే ఉన్నది. దేశంలో కరోనా కట్టడి, అన్ని రాష్ర్టాలకు టీకాల పంపిణీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతుంటే.. బండి మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై పనిగట్టుకొని విమర్శలకు పాల్పడుతున్నారు. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వస్తే విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేసిన బండి.. తాజాగా ఈటలపై ఎందు కు విచారణ జరుపుతున్నారనే విధంగా మాట్లాడటం గమనార్హం. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్.. జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అసహనం ప్రదర్శించారు. ఒక దశలో బూతు పురాణం అందుకోవటానికి సైతం వెనుకాడలేదు. వాస్తవానికి మొన్నటివరకు రాష్ర్టాలకు టీకా పంపిణీ అంశం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నది. రాష్ర్టాలకు కేంద్రమే టీకాలు పంపిణీ చేసింది. ఈ విషయం తెలియని సంజ య్.. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, టీ కా నిల్వలున్నా రెండ్రోజులపాటు వ్యాక్సినేషన్ బంద్ చేసిందని గొంతు చించుకున్నారు. మొన్నటికి మొన్న రాష్ర్టానికి 30 లక్షల డోసుల టీకాలు పంపాలని కేం ద్రాన్ని కోరితే.. వచ్చింది 4లక్షల డోసులే. ఇవి 3 రోజుల్లోనే అయిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో టీకా పంపిణీని వాయిదా వేశారు. ‘భారత్ బయోటెక్ హైదరాబాద్లోనే ఉన్నది కదా? వారితో మాట్లాడి రాష్ర్టానికి టీకాలు ఎక్కువ తేవొచ్చుకదా? అనేది మరో విచిత్రమైన ప్రశ్న. టీకా ఉత్పత్తి చేసే కంపెనీలు మొన్నటిదాకా కేంద్రం పరిధిలోనే ఉన్నాయనే విషయం తెలియక.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ చెలరేగారు. టీకాల కొనుగోళ్లపై కేంద్రం రాష్ర్టాలకు అధికారం ఇచ్చిన వెనువెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేశ్ రంగంలోకి దిగారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లాతో సమావేశమై.. రాష్ర్టానికి ఎక్కువ డోసులు ఇచ్చే విషయంలో హామీ పొందారు. కానీ.. అబద్ధాల బండికి ఇవేవీ పట్టలేదు. ఒకవైపు కరోనా కేసులు, మరణాల సంఖ్యను అధికారికంగా బులెటిన్ రూపంలో విడుదల చేస్తున్నా.. మరణాలను ప్రభుత్వం దాచేస్తున్నదని మరో పనికిమాలిన ఆరోపణ చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది బండి మరో పసలేని ఆరోపణ. వాస్తవానికి దేశంలో కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇతర రాష్ర్టాలతో పోల్చితే రికవరీ రేటు ఎక్కువగా, మరణాల రేటు తక్కువగా ఉన్నది తెలంగాణలోనే.
అసలు సీఎం కేసీఆర్ కరోనా కట్టడిని పట్టించుకోవడం లేదని, సమీక్షలు నిర్వహించడం లేదని నోటికొచ్చినట్లు బండి మాట్లాడుతున్నారు. సెకండ్వేవ్ మొదలైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చివరికి తాను కరోనా బారిన పడినప్పటికీ.. ఐసోలేషన్లో ఉండే ఎప్పటికప్పుడు సీఎస్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా దేశంలో తొలిసారి సైనిక విమానాలను ఉపయోగించి ఒరిస్సా నుంచి ఆక్సిజన్ను తెప్పించారు. ఇవేవీ పట్టని సంజయ్ మాత్రం.. అబద్ధాల బండిలా సాగిపోతూ.. ప్రజల్లో చులకనవుతున్నారు.