నేటి నుంచి మున్సిపల్ మినీ పోరు ప్రచారం
ముగిసిన ఉపసంహరణల పర్వం
అచ్చంపేటలో 66 మంది, జడ్చర్లలో 112 మంది బరిలో..
రెబల్స్ లేకుండా చేసిన టీఆర్ఎస్
ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు
మహబూబ్నగర్ నమస్తే, ఏప్రిల్ 22 (తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్ మినీ పోరు ప్రచారానికి వేళైంది. ఉమ్మడి జిల్లాలోని రెండు బల్దియాల్లో శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనున్నది. ఉపసంహరణల పర్వం గురువారంతో ముగిసింది. జడ్చర్లలో 170 మంది నామినేషన్లు వేయగా 58 మంది ఉపసంహరించుకోగా 112 మంది పోటీలో నిలిచారు. ఇక అచ్చంపేటలో 111 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 45 మందిపోటీ నుంచి తప్పుకోగా 66 మంది బరిలో మిగిలారు. బుజ్జగింపులు చేపట్టి రెబల్స్ బెడద లేకుండా టీఆర్ఎస్ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రతిపక్షాలకు మాత్రం పలు చోట్ల అభ్యర్థులు కరువయ్యారు. కొవిడ్ నేపథ్యంలో సమావేశాలు నిర్వహించకుండా.. జన సమీకరణ లేకుండా ప్రచారం నిర్వహించేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు.
స్థానిక సంస్థల మినీ పోరులో ఉపసంహరణల పర్వం ముగిసింది. చివరివరకు బెట్టు చేసిన రెబల్స్ బెడద తప్పింది. జడ్చర్లలో 170మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 58మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 112 మంది పోటీలో నిలిచారు. ఇక అచ్చంపేట మున్సిపాలిటీలో 111మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 45మంది పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. బరిలో 66మంది ఉన్నారు. ఉపసంహరణల పర్వం ముగియడంతో నేటినుంచి ప్రచారం ప్రారంభం కానున్నది. కరోనాతో జన సమీకరణ లేకుండా ప్రచారం చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు.
జడ్చర్లలో అత్యధిక నామినేషన్లు
జడ్చర్ల మున్సిపాలిటీలో 27వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. 170మంది అభ్యర్థులు 241 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండు సెట్లు తిరస్కారానికి గురయ్యాయి. మొదటిరోజు ఇద్దరు, రెండోరోజు 13మంది, చివరి రోజు 58మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి 27వార్డుల్లోనూ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీ ఫారాలు అందజేశారు. బీజేపీ నుంచి 5 వార్డులకు కాంగ్రెస్ నుంచి రెండు వార్డులకు అభ్యర్థులు కరువయ్యారు. ఎంఐఎం ఏడు చోట్ల, సీపీఐ మూడుచోట్ల సీపీఎం ఒక చోట, స్వతంత్ర అభ్యర్థులు 27చోట్ల పోటీ చేస్తున్నారు.
బీజేపీకి మంగళం
బీజేపీ అభ్యర్థులు గట్టి షాక్ ఇచ్చారు. 6, 18, 19 వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ నుంచి బీ ఫారాలు తీసుకున్న తర్వాత.. తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ మూడు వార్డుల్లో అభ్యర్థులు లేకుండాపోయారు. అలాగే ఒకటో వార్డు నుంచి బీ ఫారం తీసుకున్న బీజేపీ అభ్యర్థి గంగ తాను ఎన్నికల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. వీరంతా శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. సుమారు 10మందితో పాటు బీజేపీ నాయకుడు పాలాది రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు.
అచ్చంపేటలో 66 మంది
అచ్చంపేట పురపోరులో 66మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 20 వార్డులకు గానూ 111నామినేషన్లు వేయగా.. అందులో 38 మంది రెండు సెట్లు వేశారు. ఇందులో నుంచి 45మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 66మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న 20మంది అభ్యర్థులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీ ఫారాలు అందజేశారు. పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన 21మంది రెబల్ అభ్యర్థులు పార్టీ నాయకులు నచ్చజెప్పడంతో పోటీ నుంచి విరమించుకున్నారు. రెబల్స్ నుంచి ఇబ్బంది లేకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాము కూడా అన్ని వార్డులకు పోటీ చేస్తున్నామని చెప్పుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు పోటీ పడ్డాయని, కనీసం ముఖ పరిచయం లేని అభ్యర్థులను బరిలో నిలిపాయని అంటున్నారు. అచ్చంపేటలో 20వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి అన్ని వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
నేటినుంచి ప్రచార హోరు
మినీ పురపోరులో ఉపసంహరణల పర్వం ముగియడంతో నేటినుంచి ప్రచార పర్వం ప్రారంభం కానున్నది. కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున తక్కువ మంది జనంతో ప్రచారాలు చేపట్టాలని అభ్యర్థులు భావిస్తున్నారు. వార్డులో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు.. తక్కువమంది అనుచరులతో కలిసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ పురపోరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ సన్నద్ధం
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల