హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బాల్యవివాహాల నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా సమాజంలో ఇంకా బాల్య వివాహాలు జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాను ఎంపిక చేసుకుని.. అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో ఆమె వెబినార్ నిర్వహించారు.