హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె లయకు సంబంధించిన సాధారణ సమస్య)తో బాధపడుతున్న ఇద్దరు రోగులకు హైదరాబాద్లోని ఏఐజీ దవాఖాన సరికొత్త క్రయోబెలూన్ టెక్నిక్తో చికిత్స నిర్వహించింది. దక్షిణ భారతావనిలో ఈ టెక్నిక్ను ఉపయోగించడం ఇదే తొలిసారి. గత వారం ఈ చికిత్స చేయించుకున్న ఇద్దరు రోగులను మరుసటి రోజే డిశ్చార్జి చేశామని, ప్రస్తుతం వారు తమ పనులన్నీ మామూలుగానే చేసుకోగలుగుతున్నారని ఏఐజీ హాస్పిటల్స్ డైరెక్టర్, ఎలక్ట్రో ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ సీ నరసింహన్ సోమవారం వెల్లడించారు. చాలా తక్కువ కోతతో కూడిన ఈ టెక్నిక్తో ఆ ఇద్దరు రోగులకు చికిత్స చేయడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో 50 లక్షల మందికిపైగా ప్రజలు ఆట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణంగా తలెత్తే సమస్యే అయినప్పటికీ చాలా తీవ్రమైనదని, దీని వల్ల గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు పెరుగుతుందని డాక్టర్ నరసింహన్ వివరించారు.