రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నూతనంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలి. పరిశ్రమల స్థాపనకై దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు టీఎస్ ఐ-పాస్ నిబంధనలకు లోబడి సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి, పరిశ్రమలకు అనుమతుల మంజూరు, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 11.09 కోట్ల పెట్టుబడితో 54 పరిశ్రమలను స్థాపించడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. తద్వారా 569 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే రవాణా వాహనాలకు సంబంధించి పారిశ్రామిక రాయితీ పథకం ద్వారా కొనుగోలు చేసిన 57 మంది ఎస్సీ అభ్యర్థులకు 157.62 లక్షల రూపాయలు, 34 మంది ఎస్టీ అభ్యర్థులకు 93.22 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, లీడ్ బ్యాంక్ అధికారి రంగారెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంస్థ అధికారి చంద్రవికాస్, ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వాహణ సంచాలకులు డా.వినోద్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, సెస్ డీఈఈ రఘుపతి, గిరిజన సంక్షేమ అధికారిని శైలజ, కాలుష్య నియంత్రణ బోర్డ్ అధికారి సుభాష్, దళిత పరిశ్రమల సమాఖ్య జిల్లా ప్రతినిధి మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన