వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ముసురుతో ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గురువా రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కుంటల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి తొలగించాలన్నారు. బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలను గుర్తించి తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.