హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కృష్ణానీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలో ఏపీ ప్రభుత్వం న్యాయబద్ధంగా, సామరస్యంగా వ్యవహరిస్తేనే జలవివాదాలకు తెరపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రధానికి లేఖలు రాయడం, కేంద్రమంత్రులు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని స్పష్టంచేశారు. ఉమ్మడి పాలనలో మాదిరిగానే ఆంధ్రా పండాలి.. తెలంగాణ ఎండాలి అనేలా వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు. శుక్రవారం మంత్రుల నివాస సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్తు ఉత్పత్తి కోసమే నిర్మించిందని.. కానీ, మద్రాసుకు తాగునీరు అందించాలనే వంకతో కాలువలు తవ్వి అక్రమంగా రాయలసీమ, నెల్లూరుకు సాగునీటిని తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రాంతంలో అక్రమ ప్రాజెక్టులు కట్టారని.. ఇప్పుడు వాటినే ముందుపెట్టి కృష్ణాజలాల్లో అత్యధిక వాటాను ఏపీ దక్కించుకుందని తెలిపారు. 20 వేల చదరపు కిలోమీటర్ల కృష్ణా పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు 299 టీఎంసీలు.. 9 వేల చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతమున్న ఏపీకి 511 టీఎంసీలు దక్కడమే ఇందుకు నిదర్శమని ఉదహరించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుని తీరుతామని చెప్పారు.
నిబంధనలకు లోబడి, ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, కృష్ణా బోర్డు మార్గదర్శకాల మేరకే శ్రీశైలంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని.. దానిని అక్రమం అంటూ విమర్శించే నైతికహక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని నిరంజన్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కరువులోనూ కేవలం కృష్ణా డెల్టా కోసం నిబంధనలకు విరుద్ధంగా దిగువకు నీటిని విడుదల చేసి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని.. ఇప్పుడు నీళ్లు సముద్రంలో వృథాగా కలుస్తాయని పెడబొబ్బలు పెట్టడం అర్థరహితమని వివరించారు. ప్రస్తుత జలవివాదానికి కాంగ్రె స్, బీజేపీ అవకాశవాద రాజకీయాలే కారణమని నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేధోమథనంతో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని.. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఒక్క కేసు కూడా వేయడం లేదని విమర్శించారు. కేంద్రం నిర్దిష్ట గడువు పెట్టి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ద్వారా సత్వరమే కేటాయింపులు జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.