హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్మార్కెటింగ్కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్మార్కెటింగ్పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ చేయాలని ప్రజలకు సూచించారు.
కరోనా సోకిన ప్రొఫెసర్కు ఈసీఎంహెచ్వో (ఎక్మో) చికిత్స కోసం బెడ్ను సిద్ధం చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఖమ్మంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రొఫెసర్ అబిద్అలీకి అత్యవసరంగా ఎక్మో వైద్యం అం దించాల్సి ఉన్నది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. బెడ్ సిద్ధం చేయాలని కోరుతూ మర్రికి ట్వీట్ చేశారు. దీంతో ఆయన మంత్రి మల్లారెడ్డి సహకారంతో సోమాజిగూడ యశోద దవాఖానలో ఏర్పాట్లుచేశారు. ఎక్మో చికిత్సకు ఏర్పాటుచేసిన మర్రి రాజశేఖర్రెడ్డిని కేటీఆర్ మరో ట్వీట్ ద్వారా అభినందించారు.