హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమలలో దేవతామూర్తుల సేవలకు ఉపయోగించిన పుష్పాలతో తయారుచేస్తున్న అగర్బత్తీలను ఈ నెల 13 నుంచి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ అగర్బత్తీలను ఏడుకొండల పేర్లయిన అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి అనే ఏడురకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తారు. టీటీడీ ఆలయాల్లో దేవతామూర్తుల పూజలు, అలంకారాల కోసం నిత్యం వివిధ రకాల పుష్పాలను వినియోగిస్తారు. మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. వీటితో పరిమళభరితమైన వాసనలు వెదజల్లే అగర్బత్తీలను తయారుచేసేందుకు బెంగళూరు కేంద్రం గా పనిచేసే దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకోసం ఎస్వీ గోశాలలో అగర్బత్తీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.