హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలు, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ఆఫ్రికన్ నేరగాళ్లు మరో నేరావతారం ఎత్తారు. టాంజానియా, ఉగాండా దేశాలకు చెందిన అందమైన అమ్మాయిల ద్వారా నయా దందా సాగిస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆయా దేశాల్లోని యువతులను నేర సామ్రాజ్యంలోకి ఈడ్చుకొస్తున్నారు. వారిని విజిటింగ్, మెడికల్ వీసాలపై మనదేశానికి తరలిస్తున్నారు. వారికి డబ్బు ఆశ జూపి, కాంట్రాక్టులు కుదుర్చుకొని, వ్యభిచారంలోకి దింపుతున్నారు. మన దేశంలో ఆఫ్రికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో అమ్మాయిలను దింపి, దందా సాగిస్తున్నారు. మన దేశానికి చదువుల నిమిత్తం వచ్చే ఆఫ్రికన్లకు ఈ యువతుల ద్వారా గాలం వేస్తున్నారు. ముందుగా సెక్స్, మెల్లగా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత వారిని సైతం డ్రగ్స్ రవాణా రొంపిలోకి దింపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు సమాచారం. టాంజానియా, ఉగాండా యువతులపై మనదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తుండటంతో వారిని కూడా ముగ్గులోకి లాగుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా వ్యభిచారంలోకి దింపి, నెమ్మదిగా డ్రగ్స్ను అలవాటు చేస్తున్నారని, నమ్మకం కుదరగానే పెడ్లర్లుగా మారుస్తున్నారని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
గతంలో ఆఫ్రికన్ ముఠాలు హైదరాబాద్లో మకాం వేసి, దందాలు నడిపేవారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతో బెంగళూరుకు మకాం మార్చారు. అక్కడినుంచి హైదరాబాద్లోని పాత కస్టమర్లకు ఆఫ్రికన్ యువతులతోపాటు కొత్త పెడ్లర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ను బ్రెడ్ ప్యాకెట్లు, చాక్లెట్ల డబ్బాల్లో పెట్టి, విమానాలు లేదా రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం. ఇలా డ్రగ్స్ తీసుకొచ్చిన అమ్మాయిలకు తడవకు రూ.ఐదు వేల చొప్పున ముట్టచెప్తున్నారు. ఒకవేళ వారు పట్టుబడినా తమ సమాచారం బయటకు పొక్కకుండా డ్రగ్స్ ముఠా నాయకులు జాగ్రత్త పడుతున్నారు. వీసా గడువు ముగిసిపోయినా, ఉపాధి లేకపోయినా కొంతమంది ఆఫ్రికన్లు అక్రమంగా దేశంలో ఉంటున్నారు. డ్రగ్స్ సరఫరా, ఇతర అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించేందుకు ఉంటున్నారనేది ఒక సీనియర్ అధికారి విశ్లేషణ. తరచూ కార్డన్సెర్చ్లు నిర్వహించడం, సరైన పత్రాలు లేని, అక్రమంగా నివాసముంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి దందాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో వేళ్లూనుకున్న ఈ ముఠాలపై సీరియస్గా దృష్టి పెట్టకపోతే, వీరి ఆగడాలు మన రాష్ట్రంలోనూ విస్తరించే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.