హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విమానయాన, రక్షణ (ఏరోస్పేస్, డిఫెన్స్) రంగాలకు హైదరాబాద్ హబ్గా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి సంస్కరణలు, సదుపాయాల కల్పనతో ఐదేండ్లలోనే అనూహ్య వృద్ధి సాధించామని చెప్పారు. హైదరాబాద్లోని ‘టాటాబోయింగ్ ఏరోస్పేస్ డెలివరీస్’ సంస్థ అపాచీ హెలికాప్టర్ల (ఏహెచ్-64) ఫ్యూజ్లేజ్ల ఉత్పత్తిలో 100వ మైలురాయిని చేరుకున్నది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ టాటా బోయింగ్ సంస్థకు అభినందనలు తెలిపారు. బోయింగ్ సంస్థను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. 2014లో ఐటీ శాఖ మంత్రి హోదాలో అమెరికా వెళ్లి బోయింగ్ అధికారులతో చర్చలు జరిపానని చెప్పారు. అదే సమయంలో టాటా సంస్థకు చెందిన సీనియర్ అధికారులుకూడా వచ్చారని తెలిపారు. అనేక చర్చల అనంతరం టాటా-బోయింగ్ సంయుక్తంగా హైదరాబాద్లో సంస్థను స్థాపించాయని పేర్కొన్నారు. అతితక్కువ కాలంలోనే కంపెనీ వందో ఫ్యూజ్లేజ్ను ఉత్పత్తి చేయడం గర్వంగా ఉన్నదని హర్షం వ్యక్తంచేశారు.
ప్రపంచ నంబర్వన్
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐపాస్ వంటి వినూత్న సంస్కరణలను అమలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. దీంతోపాటు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏడు ఇండస్ట్రియల్ పార్క్లున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన మానవ వనరులతో ఐదేండ్లలోనే ఈ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ ఈ రెండురంగాల్లో ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూశామని చెప్పారు. అంతర్జాతీయ సంస్థ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ గ్రూప్నకు చెందిన ఎఫ్డీఐ తాజాగా విడుదల చేసిన ‘ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్ 2020-21’ జాబితాలో వ్యయ సమర్థత (కాస్ట్ ఎఫెక్టివ్నెస్) విభాగంలో హైదరాబాద్ ప్రంపంచలోనే మొదటి ర్యాంకు సాధించిందని చెప్పారు. దీంతోపాటు కేంద్ర పౌర విమానయానశాఖ తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తించి 2018, 2020లో అవార్డులు అందజేసిందని గుర్తుచేశారు.
మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ 1960వ దశకం నుంచే ‘మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియా’గా కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. డీఆర్డీవోకు చెందిన డజనుకుపైగా ల్యాబ్లు నగరంలో ఉన్నాయని చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీడీఎల్, ఈసీఐఎల్, హెచ్ఏల్ తదితర సంస్థలు ఉన్నాయని చెప్పారు. వీటికి అదనంగా రక్షణరంగంలో వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఇటీవలే బోయింగ్ ఇండియా సంస్థ హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, రఘువంశీ ఏరోస్పేస్తో ఒప్పందాలు చేసుకొన్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన రెండు ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు.
ఇక్కడే పెట్టుబడులు పెట్టండి
ఏరోస్పేస్ రంగంలో ఉత్పత్తితోపాటు పరిశోధనలపైనా దృష్టిసారించామని కేటీఆర్ పేర్కొన్నారు. బోయింగ్, టీ-హబ్ కలిసి గతంలో ‘హరిజోన్-ఎక్స్’ పేరుతో కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. ఇందులో 8 కంపెనీలు తుది జాబితాకు ఎంపికయ్యాయని, ఇదేతరహాలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. ఐఎస్బీ వంటి ఒక సంస్థను ఏర్పాటుచేసి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. తద్వారా హైదరాబాద్ నుంచి ప్రపంచస్థాయి నిపుణులను తయారుచేయవచ్చని అన్నారు. బోయింగ్ సంస్థ తన 737 విమానాల కోసం వర్టికల్ ఫిన్ను హైదరాబాద్లో ఉత్పత్తి చేయనుండటంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. బోయింగ్ సంస్థ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. బెంగళూరుతో పోల్చితే మెరుగైన వసతులున్న. హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చుకోవాలని కంపెనీలను కోరారు.
పరిశ్రమల గమ్యస్థానం తెలంగాణ
బోయింగ్ ఇండియా చైర్మన్ ససిల్గుప్తా మాట్లాడుతూ.. నిపుణులైన మానవ వనరులు, అద్భుతమైన మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల విధానాలు, బాధ్యతాయుతమైన ప్రభుత్వయంత్రాంగం కలిసి తెలంగాణను పరిశ్రమల గమ్యస్థానంగా మార్చాయని ప్రశంసించారు. టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రెండేండ్లలోనే భారత్లో పెట్టుబడులను నాలుగింతలకు పెంచిందని పేర్కొన్నారు. ఎయిరోస్పేస్, రక్షణరంగాల్లో భారత్తోపాటు ప్రపంచదేశాలకు ఉత్పత్తులను అందజేస్తున్నదని చెప్పారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) సీఎండీ సుకరన్సింగ్ మాట్లాడుతూ మూడేండ్లలోనే 100వ మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు.