200 కోట్లతో భారీ ప్రాజెక్టు
ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు నిలయమైన అనంతగిరి హిల్స్ అడ్వెంచర్ టూరిజంకు చిరునామాగా మారనున్నది. రూ.200 కోట్లతో అక్కడ సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గుర్రపు స్వారీ, డిర్ట్ బైక్స్, సైకిల్ ట్రాక్, జిప్ లైన్స్, నేచర్ ట్రెకింగ్ తదితరాలతో భారీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 1,500 మందికి ఉపాధి లభించనున్నది. అనంతగిరి హిల్స్లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధిపై ఎంఎం సిటీ సంస్థ ఇటీవలే పర్యాటక శాఖకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ సంస్థ ప్రతిపాదనల మేరకు పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్రావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రెండు మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లనుంది. ఈ బృందం ఇచ్చే నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ‘సమస్తే తెలంగాణ’కు తెలిపారు. అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయని, అనంతగిరిని అద్భుతమైన అడ్వెంచర్ టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.