మన రాజ్యాంగం ప్రకారం విద్యను వ్యాపార సరుకుగా చూడటానికి వీలులేదు. పాఠశాలలు ఎవరు నిర్వహించతలపెట్టినా ప్రభుత్వం వాటికి లాభాపేక్ష లేని సంస్థలుగానే అనుమతినిస్తాయి. నిజానికి ప్రైవేటు పాఠశాలలు లాభాపేక్ష లేని సంస్థలుగా సేవా కార్యక్రమంలో భాగంగానే ఉండాలి. ఆ రకంగానే వాటికి చట్టరీత్యా ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. గత 20-25 ఏండ్లలో ప్రభుత్వాలు విధివిధానాలను అమలుచేయకుండానే ప్రైవేటు బడులకు అనుమతులిచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ బడుల కన్నా ప్రైవేటు బడులలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సేవాదృక్పథంతో అనుమతులు పొంది మొదలైన ప్రైవేటు బడులు క్రమంగా లాభాలు ఆర్జించే వ్యాపారంగా రూపుదిద్దుకున్నాయి.
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండేలా చూడాలి. మొత్తంగా ప్రభుత్వ విద్యను పటిష్ఠపరచడమే అంతిమ పరిష్కారం అని గుర్తించాలి. గురుకుల పాఠశాలలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అందువల్ల ప్రభుత్వం తాత్కాలిక పరిష్కారాలు వెతుకుతూనే ప్రభుత్వ విద్యావ్యవస్థకు జవసత్వాలు కల్పించాలి.
రాష్ట్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం 2017-18లో నమోదైన 60 లక్షల మంది విద్యార్థుల్లో 32 లక్షల మంది ప్రైవేటు బడులలో చదువుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 8లక్షల 50వేల మంది బడికి వెళ్తున్న పిల్లల్లో 6 లక్షల 74వేల మంది ప్రైవేటు బడులలోనే చదువుతున్నారు. అంటే దాదాపు 80 శాతం మంది పిల్లలు ప్రైవేటు బడుల్లో ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 71 శాతం, మేడ్చల్లో 82శాతం, వరంగల్ అర్బన్ జిల్లాలో 66శాతం మంది పిల్లలు ప్రైవేట్ బడుల్లో చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల నిర్వహణ 39 ఏండ్ల కింద చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం- 1982 ప్రకారమే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ మధ్య కరోనా సమయంలో 2020 ఏప్రిల్లో విడుదల చేసిన జీవో 46 కూడా 1993లో రూపొందించిన నియమాలలోని రూల్ 21 ప్రకారం రూపొందినదే.
ప్రైవేటు విద్యాసంస్థల నియమాల ప్రకారం- ప్రవేశ రుసుము ఉండకూడదు. పాఠశాల యాజమాన్యాలు 5 శాతం కంటే ఎక్కువ లాభాలు తీసుకోవద్దు. వసూలు చేసిన ఫీజులలో 50 శాతం టీచర్ల జీతాలకు వినియోగించాలి. ఇంకో 15శాతం ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించాలి. ప్రత్యేక బ్యాంకు అకౌంటు తెరువాలి. వార్షిక నివేదికలు సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500, డిపాజిట్ రూ.5000 మాత్రమే తీసుకోవాలి. ఇవి తప్ప మరే రకమైన పేర్లతో డబ్బులు వసూలు చేయవద్దని నియమాలు పేర్కొంటున్నాయి. నోటుపుస్తకాలు, బట్టలు పాఠశాలలు అమ్మడానికి వీలులేదు. ఒకవేళ అమ్మినా చౌక ధరలకు అమ్మాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీ ఉండాలి. వాటిలో తల్లిదండ్రులకు స్థానం కల్పించాలి. ఫీజుల విషయంలో తల్లిదండ్రులతో సంప్రదించాలి. ఇలా పలు నిబంధనలున్నా ఆచరణలో అవేమీ అమలుకావటం లేదు. సుప్రీంకోర్టు, పలు రాష్ట్ర హైకోర్టులు కూడా ఫీజులను నియంత్రించాలని, విద్యావ్యాపారాన్ని అరికట్టాలని పలు సందర్భాలలో ప్రభుత్వాలకు వాటి బాధ్యతను గుర్తు చేశాయి.
కరోనా ఫలితంగా బడులు మూసిన కారణంగా విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు. డిజిటల్ విద్య అందరికీ అందలేదు. డిజిటల్ డివైడ్ అనే మరో నూతన అసమానత అనుభవంలోకి వచ్చింది. విద్యాసంస్థలు ఫీజులు చెల్లించనివారికి ఆన్లైన్ లింకులు పంపకుండా మనోవేదనకు గురిచేశాయి. ఫీజులు చెల్లించినవారిని పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు తప్పనిసరిగా తమ వద్దనే కొనాలని ఒత్తిడి చేశారు. నియమ నిబంధనలు, నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా ఎవరికి తోచిన తీరుగా వారు ఫీజులు వసూలు చేస్తున్నారు. నర్సరీకి రూ.10 వేల నుంచి మొదలై 10వ తరగతికి రూ.75 వేల వరకు ఫీజులున్నాయి!
పేద వర్గాలకు చెందినవారు తమ సంపాదనలో అత్యధిక శాతం వారి పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని త్యాగాలు చేస్తున్నారు. కరోనా కాలంలో ఆదాయాలు తగ్గి బతుకు పోరు ఒకవైపు, ఫీజులు ఎలా భరించాలనే ఆవేదన మరోవైపు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను సక్రమంగా అమలుపరచడంలేదని వాపోతున్నారు. కరోనా ప్రభావంతో ప్రైవేటు బడులకు ఫీజులు కట్టలేక చాలామంది బడి మానేసే ప్రమాదం ఉంది. ఇందులో ఆడపిల్లల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశమున్నది.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నిర్ధారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన
అవసరం ఉంది. బడులను బట్టి వాటి సేవలకు అనుగుణంగా ఫీజులను
నిర్ధారించి, అవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. ప్రతి జిల్లాలో పూర్తి అధికారాలతో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయటంతో పాటు, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పరచాలి.
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండేలా చూడాలి. అలాగే చదువు చెప్పే బాధ్యతను నిర్వర్తిస్తున్న తమకు ప్రభుత్వం కరోనా లాంటి విపత్తులో ఆర్థికంగా సాయమందించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు కోరుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ విద్యను పటిష్ఠపరచడమే అంతిమ పరిష్కారం అని గుర్తించాలి. గురుకుల పాఠశాలలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అందువల్ల ప్రభుత్వం తాత్కాలిక పరిష్కారాలు వెతుకుతూనే ప్రభుత్వ విద్యావ్యవస్థకు జవసత్వాలు కల్పించాలి. అప్పుడే అందరికీ నాణ్యమైన విద్య అంది సమాజం ఉన్నతీకరించబడుతుంది.
(వ్యాసకర్త: ఎం.వి. ఫౌండేషన్ జాతీయ కన్వీనర్)
ఆర్.వెంకటరెడ్డి