నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణలో కలుపు మొక్కలుగా పెరుగుతున్న పార్టీలతో ఎప్పటికైనా ప్రగతికి చేటేనని, వాటిని పీకేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం నిరాటంకంగా కొనసాగుతాయని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో అన్నీ పొందామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీ య హోదా, ఐటీఐఆర్ ప్రాజెక్టు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయని, ఇంటింటికీ తాగునీరందించే మిషన్భగీరథకు నిధులివ్వని బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలో పట్టభద్రులు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్లో ఉద్యోగులు, పట్టభద్రుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి మాట్లాడుతూ.. ‘ఆ దిబ్బనేమో తోడేలు గుంపు ఉంది.. ఈ దిబ్బనేమో ఆవుల మంద ఉంది.. మీరు ఏ పక్కన ఉంటారు?’ అని పాటల రూపంలో వేసిన ప్రశ్నకు పట్టభద్రుల నుంచి మంచి స్పందన వచ్చింది. 30 ఏండ్ల క్రితం పల్లెల నుంచి పట్నాలకు వలసలను చూశానని, ఆరేండ్ల సంది పట్నాల నుంచి పల్లెల బాట పడుతున్న ప్రజలను చూస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలన తీరుకు ఇది నిదర్శనమని అన్నారు. సమస్యల పరిష్కారానికి తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు.
ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తుంటారని విమర్శించారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థను కేంద్రం తాత్సారం చేసిందని, అందువల్లే పదోన్నతులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేక కొందరు ఆగం చేసే ప్రయ త్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల స్పందన చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిపై వారికి ఉన్న అభిమానం తెలుస్తున్నదని చెప్పారు. పోలింగ్ రోజు సెలవు ఉన్నదని ఓటేయడం మర్చిపోవద్దని కోరారు.
సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాను. అందుకు అవకాశం ఇవ్వండి. మా కుటుంబం, మా నాన్నగారి పనితీరు మీకు తెలుసు. సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి. తెలంగాణలో అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డుపడుతూ కలుపు మొక్కలుగా పెరుగుతున్న ఇతర పార్టీలను పీకిపారేయాలి.
– టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి