న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈసారి ప్రైవేటు సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు తమకు ఏ వ్యాక్సిన్ కావాలో అదే వేసుకునే అవకాశం కలగనుండటం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎకనమిక్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ప్రతి సెంటర్ తమ దగ్గర ఏ వ్యాక్సిన్, ఎంత ఉంది, దాని ధర ఎంత అన్న వివరాలు CoWIN వెబ్పోర్టల్లో అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంచుకునే వీలు మాత్రమే ఉండేది. వ్యాక్సిన్ మాత్రం అక్కడి ఉన్నదే ఇచ్చేవాళ్లు. అయితే ఇక నుంచి మీకు కావాల్సిన వ్యాక్సిన్ను కూడా ఎంచుకునే వీలుంటుంది. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.
మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు వేయనుండగా.. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. 18 నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది. నేరుగా వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయరు. 45 ఏళ్లు పైబడిన వారు మాత్రం ఇప్పటికీ నేరుగా వెళ్లి అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చు.