నల్లగొండ, అక్టోబర్ 5: హరితహారం కార్యక్రమం రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆకుపచ్చని తోరణాలు కడుతున్నది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్క లు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఆరో విడత హరితహారంలో నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై మల్టీ లేయర్ (రెండుమూడు వరసలు) పద్ధతిలో నాటిన మొక్కలు ఇప్పు డు రోడ్డుకే అందాలను అద్దుతున్నా యి. ఈ రహదారిపై ట్రయల్న్ విజయవంతమవ్వడంతో ఏడో విడతలో రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మల్టీలేయర్ పద్ధతిలో మొక్కలు నాటారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 250 కిలోమీటర్ల పరిధిలో ప్రతి కిలోమీటర్కు 400 మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించి, అమలుచేసింది. ఇప్పటివరకు ఏడు జిల్లాలు ఈ లక్ష్యాన్ని చేరుకొన్నాయి.
అద్దంకి-నార్కట్పల్లి రహదారి వెంట 86 కిలోమీటర్ల దూరం మల్టీలేయర్లో మొక్కలు నాటారు. రోడ్డుకు ఇరువైపులా 400 మొక్కల చొప్పున మొత్తం 34,400 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే కొన్నిచోట్ల స్థలాన్ని బట్టి మూడునాలుగు వరుసలు ఏర్పాటుచేయటంతో మొత్తం 87,550 మొక్కలు నాటించారు. ఏపుగా పెరిగే రావి, కానుగ, గుల్మోహర్, బాదం, నేరేడు, మర్రి, వేప లాంటి మొక్కలు రోడ్ల వెంట నాటుతున్నారు. నాటే ప్రతి మొక్క కనీసం 150 సెంటీమీటర్ల పొడవు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొక్కల పెంపకానికి మూడువేల జనాభా ఉన్న పంచాయతీలైతే గ్రామంలోని గ్రీన్ఫండ్ వినియోగించుకోవడంతోపాటు కలెక్టర్లకు కేటాయించిన పల్లెప్రగతి నిధులు వినియోగిస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 32 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని విధించింది.