హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టు తీర్పునకు అనుగుణంగా పాస్బుక్లు మంజూరు చేసేందుకు అవకాశం కల్పించింది. పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూములుగా మార్చుకొనేందుకు ఆప్షన్ను తీసుకొచ్చింది. న్యాయ వివాదాల్లో ఉన్న భూములకు పాస్బుక్లు మంజూరు చేయకుండా గతంలోనే ధరణిలో ఆప్షన్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చాక పాస్బుక్ పొందేందుకు ప్రత్యేక ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. సిటిజన్ లాగిన్లో ‘అప్లికేషన్ ఫర్ పీపీబీ-కోర్ట్ కేస్’ అనే ఆప్షన్ను తీసుకొచ్చింది. ఇందులో పూర్తయిన భూములకు సంబంధించి.. హక్కులు పొందినవారు అప్లికేషన్ ఫర్ పీపీబీ-కోర్ట్ కేస్ ఆప్షన్ను ఎంచుకోవాలి. భూమి వివరాలను నింపాలి. ఆ తర్వాత కోర్టు వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదుచేయాలి. తర్వాత న్యాయస్థానం ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందో తెలుపుతూ.. సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. వివరాలను పరిశీలించిన అనంతరం పాస్బుక్ను మంజూరుచేస్తారు.
నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాలు, గ్రామాల్లో ఇండ్లకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు అధికారులు గతంలో గుర్తించారు. భూ రికార్డుల సమయంలో ఈ సర్వే నంబర్లను వ్యవసాయేతర భూములుగా గుర్తించారు. చాలామంది వ్యవసాయ భూములను మార్పిడి చేసుకోకుండా ఇండ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. ఇలాంటివారికి పాస్బుక్ మంజూరు కాలేదు. ధరణి పోర్టల్లో పాస్బుక్ లేకుండా నాలా కన్వర్షన్కు అవకాశమే లేదు. దీంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిటిజన్ లాగిన్లో ‘అప్లికేషన్ ఫర్ పాస్బుక్ వితౌట్ నాలా’ పేరుతో ఆప్షన్ను తీసుకొచ్చింది. సొంతంగా లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అది నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి ఆమోదించినా, తిరస్కరించినా దరఖాస్తుదారుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఒకవేళ ఆమోదిస్తే నాలా కన్వర్షన్కు స్లాట్ బుక్ చేసుకొని, ఫీజు చెల్లించి, నిర్ణీత సమయంలో తాసిల్దార్ వద్దకు వెళ్తే భూ మార్పిడి పూర్తి కానున్నది.