గాంధారి, జూలై 5: బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నందుకు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తావా..? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రూ.9.20 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్నట్టు దేశంలోని మరే రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? అని బండి సంజయ్ని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణులకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను చూపించి బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. ఏం తక్కువ చేస్తున్నారని పాదయాత్ర చేస్తావని ప్రశ్నించారు. గుంజుకుంటే వచ్చేది అధికారం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఉద్దేశించి మంత్రి వేముల వ్యాఖ్యానించారు.