సిద్దిపేట : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందనీయమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రూ.20 లక్షల విలువైన 10 లీటర్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను యాక్షన్ ఎయిడ్ సంస్థ ఆదివారం ఉదయం మంత్రి హరీశ్రావుకు అందజేసింది. సంస్థ రీజనల్ మేనేజర్ ఆంజనేయులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫణీంద్ర, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి శంకర్ మంత్రిని కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 20 కాన్సెంట్రేటర్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన 10 కాన్సెంట్రేటర్లు మొత్తం
రూ.20 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను అందించారు.
వీటిని ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొవిడ్ బాధితుల కోసం వినియోగించాల్సిందిగా ఓఎస్డీ బాలరాజుకు మంత్రి సూచించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ స్ఫూర్తిగా తీసుకుని సిద్దిపేట జిల్లాలోని మరిన్ని కార్పొరేట్ సంస్థలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను ఉచితంగా అందివ్వాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 32 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 96 వేల 500 విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమన్నారు. తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన బాలయ్యకు మంత్రి రూ.85 వేల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.