హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కల్తీ పత్తి విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని గురువారం రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బిల్ల వెంకటయ్య అదే గ్రామంలో వినాయక ట్రేడర్స్ పేరుతో పత్తి విత్తనాలు, ఎరువుల విక్రయ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గడువు తీరిపోయిన పత్తి విత్తనాలను నిబంధనలకు విరుద్ధంగా గోదాములో నిల్వచేసిన వెంకటయ్య.. వాటిని రైతులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బుధవారం వెంకటయ్య గోదాంలో సోదాలు జరిపారు. భారీగా కల్తీ విత్తనాలు, ఎరువులను స్వాధీనం చేసుకొని వెంకటయ్యను అరెస్టు చేశారు. రాచకొండ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ సోదాలు జరిగాయి.