నూతనకల్, మే 4 : వరిని సాగు చేయడం ఒక ఎత్తు అయితే కోతల సమయంలో కాపాడుకోవడం మరో ఎత్తు. వరి పైరు తూరిపోకుండా సరైనా సమయంలో కోతలు చేపడితే దిగుబడి అధికంగా వస్తుంది. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కొన్ని చోట్ల ముందస్తుగా వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది వరి కోతల సమయంలో అకాల వర్షాలు రైతులను వెంటాడాయి. దీంతో రైతులు నష్ట పోయారు. కాల పరిమి తిని బట్టి ఆయా రకాల వరి పంటలను సరైనా సమయంలో కోతలు చేపట్టడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవి పాటించాలి..
వరి కోతకు వచ్చే 15 రోజుల ముందు నుంచే నీటి తడులను నిలిపి వేయాలి. తర్వాత పొలంతో కల్తీ గింజలు లేకుండా వేరు చేయాలి
చివరి గింజ తయారయ్యే వరకు పొలం కోయకూడదు. లేకుంటే తాలు వచ్చే ప్రమాదం ఉంది. తాలు ఎక్కువగా ఉంటే మార్కెట్లో ధాన్యం అమ్ముకోవడం ఇబ్బందిగా మారుతుంది.
మంచు ఆరిన తర్వాత పంట కోయాలి. మంచు ఉన్న సమయంలో కోస్తే గింజలు మెత్త బడి నలుపు రంగులో మారుతాయి.
యంత్రాలతో కోసేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలి. యంత్రం వెనుకకు వచ్చే టప్పుడు చూసుకోవాలి. లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
యంత్రం కోసే ముందు పొలం మడుల చుట్టూ ఒడ్ల వెంట వరిని కోయాలి. దీంతో వరిగేను నివారించవచ్చు. సీడ్ ప్లాంటకు ధాన్యం ఇచ్చే రైతులు కల్తీ గింజలు లేకుండా చేసుకోవాలి
ఆరబెడితేనే నాణ్యత
ధాన్యం ఆరబెట్టేటప్పుడు పల్చగా పోయాలి. తద్వారా తొందరగా ఎండుతుంది. దీంతో తాటి పత్రులు కిరాయి తప్పుతుంది.
ధాన్యం ఆరబోసిన తర్వాత రోజుకు కనీసం నా లుగు సార్లు దున్నాలి. లేదా రోజుకో సారి ధాన్యాన్ని తిరగబోయాలి. దీంతో అడుగున ఉన్న గింజలు మీదికి వచ్చి సమానంగా ఆరు తాయి. తేమ శాతం కూడా త్వరితగతిన తగ్గుతుంది.
ధాన్యం ఆరబెట్టక పోతే గింజలు రంగు మారి నాణ్యత దెబ్బ తింటుంది. అదే విధంగా చెత్త, మట్టి, తేమ లేకుండా చూసుకోవాలి. తాలు ఎక్కువగా వస్తే గాలికి ఆరబోయాలి. తేమ 17 శాతం లోపు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు.
సన్న రకం ధాన్యాన్ని కొంత మంది రైతులు ఇండ్లలో నిల్వ చేసుకుంటారు. ఈ సమయంలో బ స్తాలను నేల మీద కాకుండా చెక్క బల్లాలపై నిల్వ చేసుకుంటే ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటే బస్తాలపై లీటరు నీటికి 5 మి.లీ మలాథియాన్ మందును పిచికారీ చేయాలి.