అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఓ మహిళకు భర్తతోపాటు ఇద్దరు బిడ్డలను దూరం చేయగా.. మరో కుటుంబంలో ఇంటి పెద్దను బలితీసుకొన్నది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట్ వద్ద ఆదివారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్ర మాదంలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్కు చెందిన వెంకటేశ్, అతడి భార్య పద్మ ఆటోలో అందోల్ మండలం మన్సాన్పల్లిలో బంధువుల శుభకార్యానికి బయలుదేరారు. సంగారెడ్డిలో వారి బంధువులైన భవానీ, శ్రావణ్, స్వప్న, రమేశ్, సాయిచరణ్, సాయివిఘ్నేశ్ను ఎక్కించుకొన్నారు. ఆటో అల్మాయిపేట్ శివారులోకి చేరుకోగానే ఎదురుగా జోగిపేట వైపునుంచి వస్తున్న కంటెయినర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సంగారెడ్డి శివాజీనగర్కు చెందిన శ్రావణ్ (40), అతడి కుమారులు సాయివిగ్నేశ్(11), సాయిచరణ్(7) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులు పద్మ, భవానీ, స్వప్న, రమేశ్, వెంకటేశ్ను సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్సపొందుతూ వెంకటేశ్ (39) మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శామీర్పేట, మార్చి 14: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటె యినర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టగా ముగ్గురు దుర్మర ణం చెందారు. ఉప్పల్ చిలుకానగర్కు చెందిన కరుణాకర్ (46), భార్య సరళ (38), అమె చెల్లెలు సంధ్య (30) ఆదివారం ఉదయం కారులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం నర్సన్నపేటలో ఓ శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటలకు రాజీవ్హ్రదారిపై నుంచి మేడ్చల్ జిల్లా శామీర్పేట టోల్ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు లియోనియా రిసార్ట్ సమీపంలో ముందు వెళ్తున్న కంటెయినర్ను వెనుక నుంచి ఢీకొట్టి దాని కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శామీర్పేట సీఐ సంతోషం, అల్వాల్ ట్రాఫిక్ సీఐ రాజశేఖర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని కంటెయినర్ కిందికి వెళ్లిన కారును యంత్రాలసాయంతో వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నారు.