మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవుడి భూముల వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది. సోమవారం చేపట్టిన నాటి అధికారుల విచారణ మంగళవారం కూడా కొనసాగినట్టు సమాచారం. 60 మంది అధికారులను విచారించిన ఏసీబీ, విజిలెన్స్ అధికారులు పూర్తి సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తున్నది. విచారణలో తెలిన వివరాల ప్రకారం తార్నాకలోని రాజ్యాభిలేఖనం ఆఫీస్లో మరిన్ని పురాతన లిపి పహాణీలను పరిశీలిస్తూ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి ఈటల దేవుడి భూములను కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఐఏఎస్లతో ప్రత్యేక కమిటీని నియమించి విచారణ జరుపుతున్న విషయం విదితమే.
విచారణలో లభిస్తున్న ఆధారాలు అవి దేవుడి భూములేనని స్పష్టంచేస్తున్నట్టు తెలుస్తున్నది. దేవాలయ భూములేనని ఆధారాలు లభిస్తున్న నేపథ్యంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు మరోసారి రాజ్యాభిలేఖనం కార్యాలయంలో పురాతన లిపి పహాణీలను క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉన్నారు. నేడో రేపో పూర్తి వివరాలతో భూముల వ్యవహారంపై నివేదికలను ప్రత్యేక విచారణ కమిటీకి అందించేందుకు సిద్ధమవుతున్నారు. దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లు, అక్రమ నిర్మాణాలకు అనుమతి, విద్యుత్తు కనెక్షన్లు, నిర్మించిన గోదాములకు రోడ్డు సౌకర్యం కల్పించిన నాటి వివిధ విభాగాల అధికారులను విచారించారు. ఇద్దరు ముగ్గురు వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదని సమాచారం. ఇవి దేవాదాయ భూములేనని పూర్తి ఆధారాలు లభిస్తే నాటి అధికారులపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ఏసీబీ, విజిలెన్స్ అధికారులు అంటున్నారు. కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. దేవరయాంజాల్ ప్రజలు మాత్రం అవి ముమ్మాటికీ దేవుడి భూములేనని స్పష్టంచేస్తున్నారు.