వైరా టౌన్/తొర్రూరు/నల్లగొండ సిటీ, జూన్ 8: మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో లం చం తీసుకుంటూ నలుగురు అధికారులు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్లి పేరు మీద ఉన్న 2.20 ఎకరాల భూమిలో 24 గుంటలను తన పేరిట పట్టా చేయాలని తహసీల్దార్ ఖాసీంను కలిశారు. ఇందుకు ఆయన రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. గురువారం రామకృష్ణ నుంచి తహసీల్దార్ ఖాసీం రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ను అదుపులోకి తీసుకొని ఖమ్మంలోని ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కార్మిక శాఖ సహాయ అధికారి పోలం సుమతి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. చిన్నగూడూరు మండలం బాబోజి తండాకు చెందిన ధరంసోత్ వెంకన్న కుమారుడు ఇటీవల అనారోగ్యంతో చనిపోగా కార్మికశాఖ ద్వారా లక్ష రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన లేబర్కార్డు, మరణ ప్రయోజనాన్ని మంజూరు చేసేందుకు ఇబ్బందులకు గురిచేశారు. రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా, మొదటి విడతగా రూ.20 వేలు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. గురువారం మధ్యాహ్నం వెంకన్న లేబర్ అధికారి సుమతికి రూ.20 వేల నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సుమతిని హైదరాబాద్లోని ఏసీబీ మొదటి అదనపు స్పెషల్ జడ్జి ముం దు హాజరు పరుచనున్నట్టు వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ తెలిపారు.
కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ విద్యుత్తు అధికారులు ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మల గూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ నర్సిరెడ్డి చేసిన పనులకు అగ్రిమెంట్లు ఇవ్వాలని డీఈ శంకరయ్య, సబ్ ఇంజినీర్ వెంకట్రెడ్డిని కోరగా రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న డీఈ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకొని డీఈ శంకరయ్య, సబ్ ఇంజినీర్ వెంకట్రెడ్డి పంచుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.