టీఆర్ఎస్ ఆవిర్భవించి నేటికి రెండు దశాబ్దాలు
ఇంటి పార్టీకి అండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
ఉద్యమం నుంచి బంగారు తెలంగాణ దాకా వెంటే..
ఏ ఎన్నికైనా.. ఏ కార్యక్రమమైనా జైకొట్టిన జనం..
గడ్డిపరకల్లా పదవులకు రాజీనామాలు..
లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు
ఆదిలాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది తెలంగాణలో సాంస్క ృతిక, జీవన విధ్వంసం యథేచ్ఛగా సాగుతున్న తరుణం.. మన యాస, భాషలను మనమే అసహ్యించుకునేలా చేసిన ఆంధ్రోడి చాతుర్యం.. మన గడ్డ చరిత్రను మన కళ్ల ముందే మట్టిలో కలిపేస్తున్న సందర్భం.. మన కవులు, కళాకారులకు తీరని అవమానం.. మన పండుగలు, పబ్బాలపై అంతులేని వివక్ష.. వాళ్ల పొలాలకు మన గోదావరి, కృష్ణా జలాలు.. అక్కడ మూడు పంటలకు నీళ్లు.. ఇక్కడ నదులున్నా బీళ్లు.. చివరికి ఎండే పంటలు.. ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. వాళ్లవి కొలువులు మనవి బానిస బతుకులు.. ప్రాంతం మనది.. పాలన వాళ్లది.. కష్టం మనది.. దోపిడి వాళ్లది.. ఇదిగో ఇలాంటి సందర్భంలోనే 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పురుడుపోసుకుంది. నేటి(మంగళవారం)కి సరిగ్గా రెండు దశాబ్దాలు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అజెండాగా కదిలి, సమైక్య సంకెళ్లు తెంచింది. స్వరాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. గులాబీ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రత్యేక కథనం..
2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పురుడుపోసుకున్నది. హైదరాబాద్లోని జలదృశ్యంలో అప్పటి ఉద్యమనేత, ఇప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీని ప్రకటించారు. ఉద్యమకాలంలో అనేక ఆటుపోట్లను, ఆటంకాలను, అణచివేతలను ఎదుర్కొంటూ రాష్ట్ర సాధననే లక్ష్యంగా ముందుకుసాగారు. అప్పుడు సమైక్యాంధ్ర పాలకులు ఉద్యమ పార్టీని కనుమరుగు చేసేందుకు చేయని కుటిల ప్రయత్నాలు లేవు. అయినప్పటికీ వారి ఆగడాలను చిత్తు చేస్తూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మొండి ధైర్యంలో కేసీఆర్ ప్రజల సహకారంతో ముందుకుసాగారు. అనేక సభలు, సమావేశాలు, బహిరంగ సభలు పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కండ్లకు కట్టినట్టు వివరించారు. ప్రతి తండా, గూడెం, పల్లె, పట్నం అనే తేడా లేకుండా నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో మన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని విపులంగా వివరించారు. అనేక మంది నాయకులతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రజలు తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ వెన్నంటే నడిచారు. ఉద్యమనేతలు ఎలాంటి ఆందోళనలు, రాష్ట్రసాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం పిలుపునిచ్చినా సబ్బండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం ముందువరుసలో నిలిచారు. జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునా ఎగిసిపడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రగతిబాటలో దూసుకుపోతున్నది. జిల్లాలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధాపడి ఉపాధి పొందుతారు. సాగునీరు, విద్యుత్, పంట పెట్టుబడులు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమ్మతులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు వరంగా మారాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు గతంలో ఇబ్బందులు పడిన రైతులు ప్రస్తుతం ప్రభుత్వ రంగం సంస్థలకు మద్దతు ధరతో పంటలను విక్రయిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు పేదింటి ఆడపిల్లల ఇండ్లలో వెలుగులు నింపుతున్నాయి. గతంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పౌష్టకాహారం లోపంలో ప్రజలు ఇబ్బందులు పడేవారు. గర్భిణులకు సరైన ఆహారం లభించక ప్రసవ సమయంలో రక్తహీనత లాంటి సమస్యలు వేధిస్తుండేవి. ప్రభుత్వం ఆమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపించాయి. గురుకుల పాఠశాలలు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటును అందిస్తున్నాయి. గొర్రెలు పంపిణీ, ఉచితంగా చేప పిల్లల అందజేత లాంటి కార్యక్రమాలు కులవృత్తులకు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల ఉపాధి బాగా మెరుగుపడింది.
కేసీఆర్ ఆదేశమే శిరోధార్యం
కోటపల్లి, ఏప్రిల్ 26 : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ఆదేశమే మాకు శిరోదార్యం. కేసీఆర్ దీక్ష చేపట్టిన సమయంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా కోటపల్లి మండలంలో ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయడం పెను సంచలనంగా మారింది. కేసీఆర్కు మద్దతుగా ఆ సమయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు రైలు రోకోలు చేయడం జరిగినది. ఉద్యమ సమయంలో రైలురోకో, చెన్నూర్ సబ్ స్టేషన్లో ఆస్తుల ధ్వంసం, గ్రామ పంచాయతీ కార్యాలయాల ధ్వంసం తదితరవి కలిపి మొత్తం 18 కేసులు నమోదు చేశారు. నాతో పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు 18 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించాం. తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం.
ఉద్యమ పార్టీలో ఉన్నందుకే చిత్రహింసలు పెట్టారు
కెరమెరి, ఏప్రిల్ 26 : స్వరాష్ట్ర సాధన కోసం 2001లో ఆవిర్భావించిన టీఆర్ఎస్లో చేరి మండలంలో క్రీయాశీల పాత్ర పోషించాను. నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి అధిష్టానం పార్టీ మండల అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పగించింది. ఆ కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి టీఆర్ఎస్ను ఎదగకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ కుట్రలో భాగంగా 2001, డిసెంబర్ 16న నన్ను అరెస్టు చేసి నక్సలైట్గా అక్రమ కేసు పెట్టి అనేక చిత్రహింసలు పెట్టారు. అయినా కేసులు, వేధింపులకు భయపడకుండా ఓ వైపు కోర్టుకు హాజరవుతూనే మరో వైపు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగాను. సమక్యాంధ్ర పార్టీల నాయకులు ఎన్నోసార్లు బెదిరించారు. టీఆర్ఎస్ను వీడి తమ పార్టీలో రావాలని అప్పట్లో తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వారి బెదిరింపులకు భయపడకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పని చేశా. రెండుసార్లు కెరమెరి సర్పంచ్గా, అనార్పల్లి నియోజకవర్గం నుంచి ఎంపీటీసీగా, మరోసారి ఆసిఫాబాద్ జడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాను. గత సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వచ్చింది. నా భార్య బయనాబాయిని పోటీలో నిలబెట్టాను. కెరమెరి సర్పంచ్గా విజయం సాధించింది. స్వరాష్ట్రంలో కెరమెరి గ్రామపంచాయతీని అభివృద్ధి చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం వచ్చాక దశల వారీగా ప్రగతి పనులు సాధిస్తున్నం. ఓ పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి పనులతో కెరమెరి ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మెరుగైన పాలన ప్రజల్లో భరోసా కల్పిస్తున్నది.