పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో)రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరానగర్ డివిజన్లో కాంట్రాక్టర్ బీ తిరుపతి రూ.20 లక్షలతో మురుగుకాల్వ నిర్మించారు. బిల్లు మంజూరు చేసేందుకు 2 శాతం కమీషన్ ఇవ్వాలని సీపీవో వెంకటనారాయణ కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు. ఈ మేరకు శనివారం కాంట్రాక్టర్ నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పేర్కొన్నారు.