కేటీదొడ్డి, సెప్టెంబర్ 22: లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ కథనం ప్ర కారం.. గద్వాలకు చెందిన తెలుగు రామన్న 20 ఏండ్ల కిందట కేటీదొడ్డి మండలం ఈర్లబండ శివారులో 7 ఎకరాలు కొనుగోలు చేశాడు. తర్వాత ఆ భూమిని పక్క పొలం రైతులు ఆక్రమించారని తెలుసుకొని సర్వే చేయాలని గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయలేదు. నాటి కలెక్టర్ శృతి ఓఝా దృష్టికి తీసుకెళ్లగా.. సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు ఈ ఏడాది జనవరి 9న భూమిని సర్వే చేశారు. కానీ హద్దులు చూపించలేదు. సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు. దీంతో రైతు సర్వేయర్ తిక్కన్నను సంప్రదించగా.. హద్దులు చూపించాలంటే రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బుధవారం గద్వాలలో సర్వేయర్ తిక్కన్న సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కేటీదొడ్డి తాసిల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.