మంచిర్యాల, జూన్ 3(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్పై అసంతృప్తి తో రగిలిపోతున్న పలువురు నేతలు ఆయనపై తిరుగబాటు బావుటా ఎగురవేస్తున్నా రు. వీరంతా గురువారం మంచిర్యాలలో సమావేశమయ్యారు. తొలుత గోనె శ్యాం సుందర్రావు ఇంట్లో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఆ తర్వాత మాజీ మంత్రి బోడ జనార్దన్ ఇంటికి మార్చారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి మాజీ ఎమ్మె ల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, మంథని, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురికి చెందిన నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని రగిలిపోతున్న వీరంతా పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివేక్ తీరు నచ్చక సోమారపు సత్యనారాయణ గతంలోనే పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. బీజేపీలో వివేక్ క్రియాశీలంగా మారినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని వీరంతా వాపోతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఈటలను బీజేపీలో చేర్చడంపై బిజీగా ఉన్న వివేక్ తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా అడ్డుపడుతున్నారని వీరు వాపోతున్నారు. బీజేపీలోనే కొనసాగాలా? లేక మరో పార్టీలో చేరాలా? అనే విషయాలపై చర్చ జరిపిన వీరు తమ రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.