కోల్కతా, మార్చి 4: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇంటి పోరుతో సతమతమవుతున్నది. తొలి దశ పోలింగ్కు మరో మూడు వారాలే ఉన్న నేపథ్యంలో తమ పార్టీలో పాత-కొత్త నాయకుల మధ్య సఖ్యత కుదర్చలేక బీజేపీకి తల ప్రాణం తోకకు వస్తున్నది. ఎన్నికల వ్యూహంలో భాగంగా కొంతకాలం కిందటే ఇతర పార్టీ నాయకులకు బీజేపీ తలుపులు తెరిచింది. దీంతో పలువురు కమలదళంలోకి వచ్చి చేరారు. మొదట్లో ఈ వ్యూహం బాగానే పనిచేసినా రానురాను అంతర్గత కలహాలు పెరిగిపోవడం బీజేపీకి తలనొప్పిగా మారింది. దాంతో సామూహిక చేరికలను ఆపేస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో ప్రత్యర్థులుగా తాము ఢీకొట్టిన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని బీజేపీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీలో చేరిన నాయకుల్లో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉండటం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గత కొంతకాలంగా 19 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఒక తృణమూల్ ఎంపీ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. మొత్తం 294 నియోజకవర్గాల్లోని 8 వేల మంది ఆశావహుల నుంచి అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేయాల్సి ఉంది.
గువాహటి, మార్చి 4: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలో కాంగ్రెస్ హామీల పరంపరను కొనసాగిస్తున్నది. తమ కూటమిని గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ తెలిపారు. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలో ఏయూడీఎఫ్, బీపీఎఫ్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏజీఎం ఉన్నాయి.
కోల్కతా, మార్చి 4: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని శివసేన ప్రకటించింది. బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీకి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తామని శివసేన అగ్రనేత సంజయ్రౌత్ గురువారం ట్వీట్ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో తీర్మానించుకున్నప్పటికీ శివసేన తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నది. మమతను పులిగా అభివర్ణించిన రౌత్.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. డబ్బు, బలప్రయోగం, మీడియాను ఉపయోగించి మమతను ఓడించేందుకు అన్నిశక్తులు ఒక్కటయ్యాయని పరోక్షంగా బీజేపీపై రౌత్ విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు కూడా ఇప్పటికే పోటీ నుంచి తప్పుకొని మమతకు మద్దతు ప్రకటించాయి.