Fraud | ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని ఓ వృద్ధుడి వద్ద కోటి రూపాయలు టోకరా వేసిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆగాపురాకు చెందిన వృద్ధుడికి 2015లో ఓ వ్యక్తి కే.పీ.ఆహుజా పేరుతో పరిచయమయ్యాడు. తన వద్ద ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తే.. బొగ్గు కంపెనీకి సంబంధించిన సుమారు రూ. 80 లక్షలు విలువ చేసే 200 షేర్లను ఫ్రీగా ఇస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన ఆ వృద్ధుడు అతడు సూచించిన ఖా తాలోకి రూ. 25 లక్షలు జమ చేశాడు. ఈ క్రమంలో 2017 నుంచి 2021 వరకు ఆగంతకులు ఆ వృద్ధుడితో మాట్లాడి మీరు ఆహుజా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు కదా.. మీకు భారీగా బోనస్లు వస్తాయని ఆశ పెట్టించారు. ఈ మాటలన్నీ నిజమేనని అనుకున్న వృద్ధుడు మొత్తం కోటి రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాడు. చివరకు మోసపోయానని భావించి జూలై 14న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ మోసానికి పాల్పడిన ఘజియాబాద్కు చెందిన రాహుల్ సింగ్ చాండెల్ను అరెస్టు చేశారు.
నిందితుడు రాహుల్ సింగ్ చాండెల్ గతంలో ఓ సంస్థలో టెలీకాలర్గా పని చేశాడు. చాలా మందితో గోల్డ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అంశాలపై మాట్లాడేవాడు. ఆ సమయంలో ప్రజల స్పందనను గమనించి.. వారిని అతి సులభంగా మోసం చేయవచ్చనే ఆలోచన వచ్చింది. ఇండియా ఇన్ఫోలైన్ సంస్థ దగ్గర ఉన్న వినియోగదారుల డేటాను చోరీ చేసి.. చాండెల్ ఇన్నోవేటివ్ బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను ఘజియాబాద్లో ఏర్పాటు చేశాడు. కొందరు టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్లు ఇస్తానని నమ్మించి.. దేశవ్యాప్తంగా అనేక మందిని ముంచాడు. ఇందుకు అలహాబాద్కు చెందిన ముఖేశ్కుమార్ ఖాతాను ఉపయోగించుకుని అతడికి కమీషన్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కేపీహెచ్బీ కాలనీ: హరిహర సదన్లో నివసిస్తున్న బానవత్ వినీశ సాఫ్ట్వేర్ ఉద్యోగి. జూలై 29న సాయంత్రం ఓ వ్యక్తి వినీశకు ఫోన్ చేసి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ..మీకు రూ.32 వేల ఆఫర్ ఉందని చెప్పాడు. ఈ క్రమంలో ఫోన్ పే లింకు పంపిస్తున్నానంటూ.. పిన్ నంబర్ను అడిగి తెలుసుకున్నాడు. ఫోన్ మాట్లాడటం ఆపిన తర్వాత వినీశ తన బ్యాంక్ అకౌంట్ను పరిశీలించగా, అందులో రూ.30వేలు ఒకసారి.. రెండోసారి 5వేలు కలిపి రూ. 35వేలు మాయమైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి సీఐ నర్సింగరావు తెలిపారు.
మెహిదీపట్నం మురాద్నగర్కు చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో దుబాయ్లో ఉంటున్న హైదరాబాదీ పరిచయమయ్యాడు. దుబాయ్లో తాను బడా వ్యాపారం చేస్తున్నానని.. రూ. 7 లక్షలు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తానని నమ్మించాడు. ఆ మహిళ ఆ మొత్తాన్ని ఇచ్చింది. నాలుగేండ్లుగా అతడు డబ్బులు ఇస్తానని వాయిదాలు వేస్తూ.. కాలం గడుపుతుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.