కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్ : ఓ తల్లి కడుపు మండింది. బీజేపీ నేత ఈటలపై తిరగబడింది. తన కొడుకు చావుకు రాజేందరే కారణమంటూ దుమ్మెత్తి పోసింది. ‘మట్టి కొట్టుకపోతవ్’ అంటూ శాపనార్థాలు పెట్టింది. కన్న కొడుకును దూరం చేశారంటూ కన్నీరు మున్నీరుగా రోదించింది. ‘ఏ ముఖం పెట్టుకోని మా ఊరికి వచ్చినవ్. మా ఉసురు నీకు తగులుద్ది’ అంటూ ఆ తల్లి అవేదనతో బీజేపీ నేత ఈటల రాజేందర్పై దుమ్మెత్తిపోసింది. నా కొడుకును పొట్టన పెట్టుకున్న నువ్వు బాగు పడవంటూ శాపనార్థ్దాలు పెట్టింది. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లెలో సంగెం అనుమమ్మ అనే మహిళ మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం సాయంత్రం ఈటల రాజేందర్ వెళ్లారు. అక్కడ బాషబోయిన ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు విజయ, మల్లయ్య ఈటలకు అడ్డం తిరిగారు. మా కొడుకు చావుకు నువ్వే కారణమంటూ దుమ్మెత్తిపోశారు. వాళ్లను తప్పించుకొని కారు ఎక్కేందుకు రాజేందర్ ప్రయత్నించారు. ఆయనను వదలకుండా కారు వరకు ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు, బంధువులు వెంబడించి శాపనార్థాలు పెట్టారు. అక్కడే ఉన్న కొందరు గ్రామస్థులు వారిని శాంతింపజేశారు. దీంతో ఈటల రాజేందర్ మారు మాట్లాడకుండా కారెక్కి అక్కడి నుంచి జారుకున్నారు.
ఉద్యోగం తీసేసి కక్ష
ప్రవీణ్ యాదవ్ హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో కేసీఅర్ కిట్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసేవాడు. ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే కోపంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఉద్యోగం కోసం ఈటల కాళ్లమీద పడ్డా ఆయన కనికరించలేదు. దాంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయి కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు కారణం ఈటల రాజేందరే అంటూ తల్లిదండ్రులు అప్పట్లోనే ఆరోపించారు. మంగళవారం రాజేందర్ కనిపించడంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. ‘నా కొడుకు చనిపోవడానికి కారణం నువ్వే. నువ్వు నాశనం అయిపోతవ్. మట్టి కొట్టుక పోతవ్ అంటూ’ శాపనార్థాలు పెట్టింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లిని స్థానికులు సముదాయించారు. పరిస్థితి గమనించిన రాజేందర్, ఆయన అనుచరులు అక్కడినుంచి చల్లగా జారుకొన్నారు. రాజేందర్ వెళ్లిపోయాక కూడా ఆ తల్లి అరగంట పాటు కొడుకును తలుచుకుంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.