ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సాఫ్ట్ సిగ్నల్, ఇన్నింగ్స్ ముగియాల్సిన సమయంపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా వివాదానికి కారణమవుతున్న ఆన్ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఐపీఎల్లో ఉండదని బోర్డు తెలిపింది. థర్డ్ అంపైర్కు నివేదించే ముందు ఆన్ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయంగా సాఫ్ట్ సిగ్నల్ ఇస్తారు. దీని ప్రభావం మూడో అంపైర్ నిర్ణయంపై కూడా ఉంటుంది.
ఈ మధ్య ఇండియా, ఇంగ్లండ్ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో ఔటైన తర్వాత ఈ సాఫ్ట్ సిగ్నల్పై కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్కు నివేదిస్తున్నప్పుడు ఇక ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఎందుకు చెప్పడం అని అతడు ప్రశ్నించాడు. దీంతో ఐపీఎల్లో దీనిని రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఒకవేళ ఆన్ఫీల్డ్ అంపైర్ ఏదైనా సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చినా కూడా అది థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపబోదని కూడా స్పష్టం చేసింది. అటు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్స్ కాల్పై కూడా కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.
90 నిమిషాల్లోపే 20వ ఓవర్
ఇక ఈ సీజన్కు కొత్తగా వచ్చిన నిబంధనల్లో కీలకమైనది 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ 20వ ఓవర్ పూర్తి కావాలి. గతంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ సమయం మరీ ఎక్కువ కాకుండా ఉండటానికి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ కచ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేటజిక్ టైమౌట్) ముగియాలి. ఆ లెక్కన గంటకు 14.11 ఓవర్లు వేయాలని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.
షార్ట్ రన్ నిర్ణయం మూడో అంపైర్కు..
ఓ బ్యాట్స్మన్ పరుగు తీసే క్రమంలో బ్యాట్ను క్రీజులో సరిగా ఉంచకపోతే షార్ట్ రన్గా అంపైర్లు ప్రకటిస్తారు. అయితే గతేడాది పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్లో అంపైర్ పొరపాటుగా ప్రకటించిన షార్ట్ రన్ వాళ్ల కొంప ముంచింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది నుంచి ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు వదిలేశారు. ఒకవేళ ఆన్ఫీల్డ్ అంపైర్ పొరపాటున షార్ట్ రన్ ప్రకటిస్తే దానిని ఓవర్ రూల్ చేసే అవకాశం థర్డ్ అంపైర్కు ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం