దుఃఖంతో మనిషికి ఏర్పడిన సంబంధమే ‘బంధం’. దుఃఖం నుంచి శాశ్వతంగా వైదొలగడమే ‘మోక్షం’. బంధమోక్షాలు జీవులకే తప్ప, రాయికీ రప్పకూ కలుగవు. ధర్మాధర్మ ప్రవృత్తుల వల్ల జన్మ సిద్ధిస్తుంది. జన్మవల్ల దుఃఖం కలుగుతుంది. దుఃఖం మూడు విధాలు: 1.శరీరం వల్ల కలిగేది (ఆధ్యాత్మికం) 2.తోటి ప్రాణుల వల్ల కలిగేది (ఆధిభౌతికం) 3.ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేది (ఆధిదైవికం). ఈ మూడూ శరీరధారులైన జీవులకే సంక్రమిస్తాయి. దుఃఖాలు అనుభవించే సమయంలో అవి వర్తమానంలో ఉంటాయి. అనుభవించిన వెంటనే అవి ‘అతీతావస్థ’ను పొందుతాయి. అయితే, ఇంకా అనుభవించాల్సిన దుఃఖాలు ‘అనాగతావస్థ’లో ఉంటాయి. అంటే, వాటిని మున్ముందు అనుభవించవలసి ఉంటుందన్నమాట. అందుకే, మనం జన్మలెత్తుతాం. జీవునికి దుఃఖంతో ఏర్పడిన బంధం శాశ్వతమైంది కాదు. శరీరం శాశ్వతం కానప్పుడు బంధం కూడా శాశ్వతం కాదు. జీవునికి శరీరంతో, శరీరానికి దుఃఖంతోగల బంధాలు తాత్కాలికమైనవే.
దుఃఖ బంధం జీవికి స్వభావ సిద్ధమైంది కాదని అర్థం చేసుకోగలిగితే అది తొలగడానికి మార్గం సుగమం అవుతుంది. ఇచ్ఛా ద్వేషాదులు జీవుని స్వభావాన్ని తెలియజేస్తాయి. వీటివల్ల ప్రవృత్తులు (కర్మలు) ఏర్పడతాయి. ఈ కర్మల వల్లనే జన్మ (శరీరం) ఏర్పడుతుంది. శరీరధారి అయినప్పుడే దుఃఖం ఆవరిస్తుంది. దీన్నే ‘బంధం’ అని పిలుస్తాం. ‘దుఃఖం శాశ్వతమైంది కాదు కనుక, దాన్ని మౌనంగా అనుభవించవలసిందేనా? తొలగించుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా?’ అని విచారిస్తే అసలు విషయం బోధపడుతుంది. మనకు ఆకలి వేసినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆహారాన్ని స్వీకరిస్తాం. ఇది తాత్కాలికమైన ఉపశమనమేగాని ఆకలిని అది శాశ్వతంగా పోగొట్టజాలదు. అలాగే, వ్యాధిగ్రస్తులమైనప్పుడు ఔషధాన్ని సేవిస్తాం. ఇదీ ఉపశమనమే తప్ప, శాశ్వత విముక్తులను చేయదు. మనం చేసే కర్మలను బట్టి, పరమేశ్వరుడు సుఖదుఃఖాలను అనుభవించడానికే సృష్టి చేశాడని శాస్త్రగ్రంథాలు ఘోషిస్తున్నాయి. సుఖం మాటున ఎక్కువగా దుఃఖమే దాగి ఉంటుంది. ఒక కోరిక తీరితే మరొక కోరిక తలెత్తుతుంది. సుఖం తర్వాత సుఖం కలిగితే బాగుండు. కానీ, దుఃఖం తర్వాత దుఃఖం సంక్రమిస్తుంది. ఇట్లా ఎడతెగకుండా వచ్చే దుఃఖ పరంపర నుంచి బయటపడటం అంత సామాన్యమైన విషయం కాదు. రాముని నోట వచ్చిన ఈ మాటలు ఈ సందర్భంగా గమనించదగ్గవి.
నమద్విధో దుష్కృత కర్మకారీ
మన్యే ద్వితీయో స్తి వసుంధరాయాం
శోకేన శోకోహి పరంపరాయా
మామేతి భిన్దన్ హృదయం మనశ్చ.
ఆచార్య మసన చెన్నప్ప 98856 54381