మియాపూర్, జూలై 6: ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుతోపాటు మరో వ్యక్తి పేరు లేకుండా చేసేందుకు ఠాణాలోనే లంచం తీసు కొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు గ్రేటర్ హైదరాబాద్లోని మియాపూర్ ఎస్సై. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ సలీం అనే వ్యక్తి తన దుకాణంలో బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తులు విక్రయిస్తున్నట్టు కంపెనీ ఫిర్యాదుపై వారం క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్లో సలీంతోపాటు అతడి దుకాణంలో పని చేసే ఉద్యోగిపైనా కేసు నమోదైంది. సలీంకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతోపాటు ఉద్యోగి పేరును తొలగించేందుకు మియాపూర్ సెక్టార్-2 ఎస్సై యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.30 వేలకు బేరం కుదరగా, ఈనెల 3న రూ.10 వేలు తీసుకున్నాడు. మిగితా రూ.20 వేలను ఎస్సై యాదగిరి మంగళవారం ఠాణాలోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఎస్సైని అరెస్ట్ చేశారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ క్రమంలో ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.