హైదరాబాద్ : ముక్కుపచ్చలారని ఓ ఆడ శిశువును రూ. 3 వేలకు విక్రయించారు. ఈ అమానుష ఘటన నగరంలోని బాచుపల్లిలో వెలుగు చూసింది. రాధ అనే మహిళ తన భర్తతో కలిసి బాచుపల్లిలో ఓ గుడిసెలో నివాసం ఉంటోంది. ఆమె ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న శాంతమ్మ అనే మహిళకు మూడు రోజుల క్రితం ఆ శిశువును రూ. 3 వేలకు విక్రయించింది. అయితే తన బిడ్డను తిరిగివ్వాలని కోరుతూ.. రాధ నిన్న శాంతమ్మ ఇంటికి వెళ్లింది. రూ. 10 వేలు ఇస్తే శిశువును తిరిగి ఇస్తానని శాంతమ్మ రాధకు చెప్పింది. దీంతో దిక్కు తోచని స్థితిలో రాధ స్థానిక అంగన్వాడీ టీచర్ను ఆశ్రయించింది. అనంతరం అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు శిశువును స్వాధీనం చేసుకున్నారు.