రాయికోడ్, జూన్ 10: వింత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద చిన్నారి చికిత్సకు సాయం చేయాలంటూ వచ్చిన ఓ ట్వీట్కు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘చిన్నారి ఫొటో చూస్తేనే ఎంతో బాధ కలుగుతున్నది. మరి అంత కష్టం ఆమె ఎలా భరిస్తున్నదో’ అం టూ చలించిపోయారు. చిన్నారికి ఆపరేషన్ చేయిస్తానని, వ్యాధి పూర్తిగా తగ్గేవరకు సహకారం అందిస్తానని గురువారం మా టిచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన పీ అవినాష్, సుమలత దంపతుల రెండో సంతానం అక్షయ. 22 నెలల అక్షయ పుట్టినప్పటి నుంచే గొంతుపై వాపుతో బాధపడుతున్నది. ప్రైవేటు ఉద్యోగి అయిన అవినాష్.. అక్షయ వైద్యం కోసం ఇప్పటికే రూ.80 వేల వరకు ఖర్చుచేశాడు. ఆపరేషన్కు భారీగా డబ్బులు అవసరం అవుతాయని పలు దవాఖానల వైద్యులు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అవినాష్ స్నేహితుడు ట్విట్టర్లో పోస్ట్చేసి మంత్రి కేటీఆర్కు ట్యాగ్చేశాడు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. పాపకు ఆపరేషన్ చేయిస్తానని, వ్యాధి పూర్తిగా తగ్గేవరకు పూర్తి సహకారం అందిస్తానని భరోసానిచ్చారు.