రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీ
చక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగం
ఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల జాగా
ఇచ్చిన ప్లాట్లలో రోడ్లు,ఇతర మౌలిక సౌకర్యాలు
నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు
మెగా వెంచర్ను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి
భవిష్యత్తులో హైటెక్సిటీ తరహాలో అభివృద్ధి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14 : ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. వారి కోసం మండలంలోని బేగరికంచె సమీపంలో ఏర్పాటు చేసే మెగా హెచ్ఎండీఏ వెంచర్లో ఆమె బుధవారం ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితారెడ్డిలతో కలిసి ఆమె పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… ఫార్మాసిటీ ఏర్పాటుపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టించారని, వాటిని పటాపంచలు చేస్తూ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించే విధంగా ముందుకువచ్చిందన్నారు.
భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అవుతుందని, భావి తరాలకు ఈ ఫార్మాసిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కాలుష్య రహిత ఫార్మాసిటీగా ముచ్చర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఈ ఫార్మాసిటీతో ఎటువంటి కాలుష్యం ఉండదని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె రైతులను కోరారు. ఇంకా ఎవరైనా భూములు ఇవ్వని రైతులుంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని, భూములిచ్చి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను పొందాలని ఆమె అన్నారు. ప్రభుత్వం భూసేకరణ వేగవంతం చేసిందని, మరో ఆరువందల కోట్లు భూసేకరణకు విడుదల చేసిందని, వెంటనే మిగిలిన భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు పదిహేను రోజుల్లో పరిహారం అందజేస్తామన్నారు. వారి త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరిచిపోదన్నారు.
అత్యాధునిక వసతులతో మెగా వెంచర్..
ఫార్మా ఏర్పాటుకోసం భూములిచ్చిన రైతులకు అత్యాధునిక వసతులతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఐదువందల ఎకరాల్లో మెగా వెంచర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు మూడువందల కోట్లతో ఈ వెంచర్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, దవాఖానలు, కమ్యూనిటీహాల్స్, పాఠశాలలను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ వెంచర్లో 40ఫీట్ల అతి విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వెంచర్ను ఐదు క్లస్టర్లుగా విభజించామని, ఒకొక్క క్లస్టర్లో ఒక్కో పాఠశాల, దవాఖాన, కమ్యూనిటీ భవనం ఉంటుందన్నారు. ఈ వెంచర్లో నివాసముండేవారు హైటెక్సిటీలో ఉంటున్నట్లుగా భావించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో ఈ మెగా వెంచర్ నగరంలో ఉన్న అత్యాధునిక ప్రాంతాలను తలదన్నే రీతిలో ఉంటుందని చెప్పారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులందరికీ ఇందులో 120 గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఎన్ని ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎకరాకు 120గజాల చొప్పున అందజేస్తామన్నారు. ఈ వెంచర్ పక్కనే అమెజాన్ రావడంతో ఈ ప్రాంతమంతా ఇప్పటికే రూపురేఖలు మారాయని మంత్రి పేర్కొన్నారు.
అర్హులైన వారిలో ఇంటికో ఉద్యోగం..
ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతుల ఇండ్లలో అర్హులైన వారందరికీ ఖచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన వారుంటే అదనంగా మరో ఉద్యోగం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు వలన 5లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు. భూములిచ్చిన రైతు కుటుంబాలు అర్హులైన వారుంటే వారికి నైపుణ్య శిక్షణ కోసం ఇబ్రహీంపట్నంలో ఒక కేంద్రాన్ని, కందుకూరులో మరొకటి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ శిక్షణ పూర్తయిన వారందరికీ ఫార్మాసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
అలాగే, మూడు నెలల్లోపు మెగా వెంచర్లో పూర్తిస్థాయిలో ప్లాట్లు తయారుచేసిన తరువాత ప్రతిరైతుకు ఇంటిస్థలానికి సంబంధించిన సర్టిఫికెట్తో పాటు ఇంకా అందని వారుంటే పరిహారం కూడా అందజేస్తామని మంత్రి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం వలన ప్రపంచస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుందని వారు అన్నారు. పార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని, మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడుల కోసం ముందుకు రావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. భూములు కోల్పోయిన ప్రతిరైతుకు ఇంటిస్థలంతో పాటు అర్హులైన వారందరికి ఇబ్రహీంపట్నంలో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను ఇప్పిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి పాల్గొన్నారు.