1.32 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు విముక్తి
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): భూ లావాదేవీలు, రికార్డులను డిజిటలైజ్చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ దూసుకుపోతున్నది. ప్రతినెల లావాదేవీల సంఖ్య పెరుగుతూ జూలైలో రికార్డుస్థాయిలో ఈ పోర్టల్ ద్వారా లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూ సంబంధ సమస్యల పరిష్కారంలో ధరణి విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భూ యజమానులకు అనేక ప్రయోజనాలు కలిగాయి. భూముల వివరాలన్నీ డిజిటలైజ్ కావడంతో వాటిని ఇష్టంవచ్చినట్టు మార్చే అవకాశం లేకుండాపోయింది. దీంతో గుంట భూమి ఉన్న రైతు కూడా గుండెలపై చేయి వేసుకొని నిబ్బరంగా ఉంటున్నాడు. రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పడింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భూ హక్కుల మార్పిడి జరిగిపోతున్నది. ప్రస్తుతం పోర్టల్లో 95 శాతానికిపైగా భూముల రికార్డులు క్లియర్గా ఉన్నాయి. కొన్ని భూముల విషయంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. అవి కూడా పరిష్కారమైతే ధరణి లక్ష్యం వంద శాతం నెరవేరినట్టేనని అధికారులు చెప్తున్నారు.
సీఎం అన్నట్టుగానే ధరణి రోజురోజుకూ విస్తృతం అవుతున్నది. ప్రారంభంలో కేవలం నాలుగు మాడ్యూల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం అవసరానికి అనుగుణంగా, ప్రజల ఇబ్బందులను తీర్చేలా మాడ్యూల్స్ను పెంచింది. ప్రస్తుతం ధరణిలో 39 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 29 సర్వీస్ మాడ్యూల్స్ కాగా, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్. వీటి ద్వారా ప్రజలకు దాదాపు 50 రకాల సేవలు అందుతున్నాయి. భూ సమస్యలకు సంబంధించి తీరొక్క ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రీవెన్స్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ అనే మాడ్యూల్లో ఏకంగా 10 రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఏండ్లుగా మోక్షానికి నోచుకోని ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. 1.32 లక్షల పెండింగ్ మ్యుటేషన్లను అధికారులు పరిష్కరించారు.
‘ప్రపంచంలో ల్యాండ్ రికార్డ్స్ క్లీన్గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏది? అని ఎవరిని అడిగినా తెలంగాణ అని అమెరికాలో కూడా చెప్పుకొనే రోజులు రావాలె. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ను తీసుకొచ్చినం. ప్రస్తుతానికి కొన్ని లావాదేవీలకే అనుమతి ఉన్నది. రానురాను ఆప్షన్లు పెరుగుతాయి’. -గతేడాది అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్
విప్లవాత్మకమైన భూసంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ధరణిలో ఆయా ప్రాంతాల్లో అప్పుడప్పుడూ తలెత్తుతున్న చిన్న చిన్న ఇబ్బందులను ప్రభుత్వం ఒక్కటొక్కటిగా తొలగించుకొంటూ వస్తున్నది. కొన్నింటికి విడివిడిగా ఆప్షన్లను జతచేరుస్తూ పోయింది. తాజాగా పొడచూపిన మరి కొన్ని ఇబ్బందులను కూడా అధికారులు, వినియోగదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపైనా అధికార యంత్రాంగం దృష్టిసారించింది.