పరకాల : వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందగా, గురువారం ఫ్రిజ్లో మృతదేహం కనిపించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సగర వీధిలో బైరం బాలయ్య(90) తన కుటుంబంతో కలిసి కిరాయి ఇంటిలో నివాసముంటున్నాడు. కాగా భార్య నర్సమ్మ, పౌరోహిత్యం చేసే కొడుకు హరికిషన్ గతంలోనే వేర్వేరుగా మృతి చెందారు. హరికిషన్ భార్య 15 ఏండ్ల కింద అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బాలయ్య మనుమడు నిఖిల్తో కలిసి జీవిస్తున్నాడు.
కాగా, రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండగా చుట్టుపక్కల వారు నిఖిల్ను అడుగగా వేర్వేరు కారణాలు చెప్తూ సమాధానం దాట వేస్తున్నాడు. గురువారం దుర్వాసన మరీ ఎక్కువ కావడంతో స్థానికులు ఇంటి యజమానికి సమాచారం అందించారు. దీంతో యజమాని ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిజ్ డోర్ తీయాల్సిందిగా నిఖిల్ను కోరగా, అది తీసే సరికి బాలయ్య మృతదేహం కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిఖిల్ను విచారించారు. మూడు రోజుల క్రితం మృతి చెందాడని ఏం చేయాలో తెలియక ఫ్రిజ్లో దాచిపెట్టానని చెప్పాడు. కాగా ఇంటి యజమాని పోరండ్ల కైలాసం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్రెడ్డి పరిశీలించారు.