హైదరాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది రైతులకు భారీమొత్తంలో వ్యవసాయరుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ) నిర్ణయించింది. సోమవారం బీఆర్కేఆర్భవన్లో 29వ ఎస్సెల్బీసీ సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1,86,035.60 కోట్లతో రుణప్రణాళికను ఆమోదించారు. ఇందులో వ్యవసాయానికి రూ.91,541.71కోట్లు కేటాయించారు. 63,67,803 మంది ఖాతాదారులకు ఈ రుణాలు అందనున్నాయి. ఇది మొత్తం వార్షిక రుణప్రణాళికలో 49.20 శాతం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 39,361.16 కోట్లు (21.16 శాతం) కేటాయించారు. ఇందులో మొత్తం ఖాతాదారులు 8,01,323. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.13,451.19 కోట్లు (7.22 శాతం), ప్రాధాన్యత లేని రంగాలకు రూ.41,681.54 కోట్లు (22.41 శాతం) కేటాయించారు.
రైతుబంధు రైతు ఖాతాల్లోకే చేరాలి: హరీశ్రావు
రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికమంత్రి హరీశ్రావు బ్యాంకర్లను కోరారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయాన్ని ఇతర రుణాలకు మళ్లించకుండా రైతుల సేవింగ్ అకౌంట్లలో నేరుగా జమచేయాలని సూచించారు. ఎస్సెల్బీసీ సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గతవారంలోనే దాదాపు 61 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,360 కోట్లు జమచేశామని తెలిపారు. రైతుబంధు సహాయాన్ని ఇతర రుణాలకు మళ్లించవద్దని సీఎంకేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. కొవిడ్ రెండో దశలో బ్యాంకర్లు ఉత్తమ సేవలందించారని అభినందించారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన బ్యాంకు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలను పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తున్నదని, స్పెషల్ ఫుడ్పాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని వివరించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్థికశాఖ ప్రత్యేకకార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్ఎల్బీసీఅధ్యక్షుడు ఓం ప్రకాష్మిశ్రా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం వై కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.