హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) మొత్తం 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.4,838 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 90 వేల నుంచి లక్ష వరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, 60-70 వేల వరకు వ్వయసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల ఉంచి రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుంటుంది. అయితే ఈ ఏడాది మే నెలలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, లాక్డౌన్తో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం భారీ స్థాయిలో మూడో వంతుకు పడిపోయాయి. ఆ నెలలో కేవలం 43 వేల లావాదేవీలు నమోదవడంతో ప్రభుత్వానికి రూ. 234 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జూన్లో లాక్డౌన్ ఎత్తివేయడంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తారన్న వార్తల నేపథ్యంలో జూలైలో చాలామంది ముందస్తు రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపారు. దీంతో ఆ నెలలో రికార్డు లావాదేవీలు నమోదయ్యాయి.