గతంలో ఎప్పుడూలేని విధంగా ఒక్క సీజన్లోనే రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం. రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేసిన కృషి ఫలించింది. ఆయన మార్గనిర్దేశం తెలంగాణ రైతుకు దిక్సూచిగా మారింది. –మారెడ్డి శ్రీనివాస్రెడ్డి , పౌర సరఫరాల సంస్థ చైర్మన్
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో వరి సాగుబడి లక్షల ఎకరాలు దాటి కోటి ఎకరాలకు చేరుకుంటున్నది. ధాన్యం దిగుబడి లక్షల టన్నుల నుంచి కోటి టన్నులకు పెరిగిపోతున్నది. 2014-15 నుంచి నేటివరకు ప్రభుత్వం 4.84 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం రైతులకు అక్షరాలా రూ.84 వేల కోట్లు అందజేసింది. ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆల్టైం రికార్డును నమోదుచేసింది. మంగళవారంతో 2020-21 యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగియగా.. రికార్డు స్థాయి కొనుగోళ్లతో తెలంగాణ రికార్డు సృష్టించింది. ఒక్క యాసంగి సీజన్లోనే 92 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందుకోసం రైతుల ఖాతాల్లో 17,300 కోట్లు జమ చేసింది. గత యాసంగిలో 64.18 లక్షల టన్నులు కొనుగోలుచేయగా.. ఈ సీజన్లో సుమారు 28 లక్షల టన్నులు అధికంగా సేకరించింది. పౌరసరఫరాల సంస్థ ఈ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, లక్ష్యాన్ని మించి 12 లక్షల టన్నులు అధికంగా వచ్చింది. ఈ యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో 23 జిల్లాల్లో అంచనాలకు మించి కొనుగోళ్లు జరిగాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాలలో 125 శాతం, నారాయణపేటలో 95 శాతం, రంగారెడ్డిలో 83 శాతం, నిర్మల్లో 44 శాతం, వరంగల్లో 64 శాతం, సంగారెడ్డిలో 32 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 33 శాతం, వికారాబాద్లో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో 7.83 లక్షల టన్నులు కొనుగోలు చేయగా.. 7.55 లక్షల టన్నులతో నిజామాబాద్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది.