హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ప్రజల భద్రతకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నా చాలా మంది బాధితులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, పోకిరీల ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ముందు కు రావడంలేదు. షీటీమ్స్ పనితీరు, వాటిపై ప్రజల్లో అవగాహన తదితర అంశాలపై సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్తోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రజలపై ఈ సర్వే నిర్వహించారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు 46.45 శాతం మంది బాధితులు అనాసక్తితో ఉన్నారని, ఫిర్యాదు చేయడం వల్ల విషయం అందరికీ తెలిసి అదో సమస్యగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారని ఈ సర్వే తేల్చింది.
తమ సమస్యలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోయామని 31.36 శాతం మంది, ఫిర్యాదు చేస్తే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో ముందుకు రాలేకపోయామని 18 శాతం మంది చెప్పినట్లు సెస్ తన నివేదికలో పేర్కొన్నది. లైంగిక వేధింపులు, ఈవ్టీజింగ్లపై ఫిర్యాదు చేసేందుకు తాము సాహసించినా తల్లిదండ్రులు అడ్డుకొన్నారని మరో 4.14 శాతం మంది బాధితులు వెల్లడించినట్టు తెలిపింది. కాగా, షీటీమ్స్కు ఫిర్యాదు చేసిన తర్వాత తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని ఈ సర్వేలో దాదాపు 84 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేసినట్లు సెస్ నివేదిక వెల్లడించింది.
వీరిలో మహిళల (81.25 శాతం) కంటే పురుషులే (88.89 శాతం) అధికంగా ఉండటం విశేషం. షీటీమ్స్పై ప్రజలకు అవగాహన బాగానే ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వీటి పనితీరుగురించి తమకు తెలుసని మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా లో 92 శాతం మంది, రంగారెడ్డి జిల్లా లో 86 శాతం మంది, మొత్తంగా 4 జిల్లాల్లో 89 శాతం మంది స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొన్నది. వీరిలో 36 నుంచి 50 ఏండ్లలోపు వయసువారు 95 శాతం మంది, 21-35 ఏండ్ల వయసువారు 94 శాతం మంది, 20 ఏండ్ల లోపువారు 77 శాతం మంది ఉన్నట్లు సెస్ వివరించింది.