హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతు న్నా, కోలుకుంటున్నవారి సంఖ్యకూడా గణనీయంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే 8,126 మంది దవాఖానలు, ఐసొలేషన్ సెంటర్ల నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో రికవరీ రేటు 82.91 శాతానికి చేరగా, జాతీయ సగటు 82 శాతంగా ఉంది. కొత్తగా 6,361 కేసులు నమోదయ్యాయని బుధవారం విడుదల చేసిన బులిటెన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్, ఇతర దీర్ఘకాలిక రోగాలతో 51 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,527కు చేరుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77,435 పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,225 కేసులు నమోదుకాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 422, నల్లగొండలో 453, వరంగల్ అర్బన్లో 234, సూర్యాపేటలో 239 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 25,569 పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.