ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/ ధరూరు, ఆత్మకూరు, మహబూబ్నగర్: ఎగువన కర్ణాటకలో నైరుతి ప్రభావం మొదలైంది. ఇదే సమయంలో నారాయణపూర్ రిజర్వాయర్లో పలు మరమ్మతులు చేపట్టాల్సి రావటంతో ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ నీటిని విడుదలచేసింది. మంగళవారం రాత్రి దాదాపు 8 టీఎంసీల నీళ్లను దిగువకు వదిలింది. దీంతో కృష్ణానదిలో నీటిప్రవాహం మొదలైంది. ఇది జూరాలను చేరటంతో బుధవారం సాయంత్రం జల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదేశాలతో జెన్కో డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో అధికారులు ఒక యూనిట్ (39 మెగావాట్ల సామర్థ్యం)ను విజయవంతంగా రన్చేశారు. ప్రస్తుతం సుమా రు 25 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. జూరాలనుంచి నీరు శ్రీశైలానికి చేరేందుకు వారం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
నెలముందుగానే..
దిగువకు వస్తున్న నీటిని గరిష్ఠంగా ఉపయోగించుకొనేలా నీటిపారుదలశాఖ అధికారులు, విద్యుత్తుశాఖ అధికారులు సమన్వయంతో సాగుతున్నారు. నిజానికి జూలై మొదటి పక్షంలో వచ్చే వరద ప్రవాహ సమయంలోనే జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం కలిగేది. కానీ నెలముందుగానే ప్రారంభమైంది. పైగా ఈ సంవత్సరం సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ చెప్పటంతో అధికారులు జల విద్యుత్తు ఉత్పత్తికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం జూరాలకు 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 7,138 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉన్నది. ప్రాజెక్ట్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.070 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 9.657టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
చరిత్రలో తొలిసారి
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల పంప్హౌస్ స్టేజ్-1 నుంచి నుంచి కోయిల్సాగర్ ప్రాజెక్టుకు బుధవారం దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. సమైక్య రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి ఎంత వరదవచ్చినా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండి దిగువకు విడుదల చేశాక శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిన తర్వాతే జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు సాగునీరు వదిలే పరిస్థితి ఉండేదని ఆల అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక జూరాలకు పైనుంచి వరద వచ్చిన వెంటనే పాలమూరు ప్రాజెక్టులన్నింటికీ నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. చరిత్రలో తొలిసారి జూన్ 9నే జూరాలపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.