హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): పరీక్షల్లో పుస్తకాలు చూస్తూ రాసుకోండి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కష్టపడాల్సిన పనిలేదు. చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూసి రాసేస్తాం అనుకొంటారు. కానీ ఇది అంత తేలికకాదని పాలిటెక్నిక్ సెమిస్టర్-1 ఫలితాలు నిరూపిస్తున్నాయి. పుస్తకాలు చూసి పరీక్షలు రాసుకొనే అవకాశం కల్పించగా, సెమిస్టర్-1 ఇంగ్లిష్ పేపర్లో మొత్తం 21,045 మంది విద్యార్థులకు 1,723 (8%) మంది ఫెయిల్ అయ్యారు. ఈ ఏడాదే పాలిటెక్నిక్లో ఓపెన్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా జనవరిలో నిర్వహించిన మొదటి సంవత్సరం సెమిస్టర్-1లో ఇంగ్లిష్ పేపర్కు పుస్తకాలు చూసి రాసుకొనే అవకాశం కల్పించారు. ఎంపికచేసిన పుస్తకాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పాఠ్యాంశాలపై అవగాహన లేకనే వీరంతా ఫెయిల్ అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సెమిస్టర్-2లోనూ ఓపెన్ బుక్ విధానాన్ని అమలుచేయనున్నారు.
ఈ నెల 26వ తేదీ నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానుండగా, ఈ పరీక్షల్లోనూ ఇంగ్లిష్ పేపర్ను చూసి రాసుకొనే అవకాశం కల్పించనున్నారు. ఈ పరీక్షల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఓపెన్ బుక్ విధానం ఉపయోగాలపై ఓ నిర్ధారణకు రానున్నారు. ఓపెన్ బుక్ విధానాన్ని ఒక్కో సెమిస్టర్కు ఒక్కో పేపర్ చొప్పున పెంచుకొంటూ పోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో ఉన్నవారు రెండు పేపర్లు రాయనుండగా, వచ్చే విద్యాసంవత్సరంలో నిర్వహించే మూడో సెమిస్టర్లో గణితం పేపర్ను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రస్తుతం ఫస్టియర్ విద్యార్థులు మూడు పేపర్లను ఈ విధానంలో రాయనుండగా, వచ్చే విద్యాసంవత్సరంలో ఫస్టియర్లో ప్రవేశించేవారు సైతం ఈ విధానంలో పరీక్షలు రాయనున్నారు.