హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్: ఉస్మాని యా దవాఖాన అరుదైన శస్త్రచికిత్సలకు చిరునామాగా మారింది. అతి క్లిష్టమైన ఆపరేషన్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూనే.. నిరుపేదల ప్రాణాలు కాపాడుతున్నది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘డోజి పాట్రీ సిండ్రోమ్’ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ శస్త్రచికిత్స దేశంలో మొదటిదని, ప్రపంచంలో మూడోదని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ గురువారం వెల్లడించారు. 2017లోనూ ప్రపంచంలోనే రెండోసారి అరుదైన స్వీయ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో వైద్యనిపుణులు విజయవంతంగా నిర్వహించారు.
జర్నల్స్ను తిరగేసి.. ఖర్చులు భరించి పాతబస్తీలోని బహదూర్పురా కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన 62 ఏండ్ల ఖైరున్నీసాబే గం కొన్ని నెలలుగా కోమాలోకి వెళ్లడం, నీరసించడంతోపాటు వాంతులు, విరేచనాలు, నిద్రలేమి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది. ఓ దవాఖానలో చూపించగా కాలేయం చుట్టూ ట్యూమర్ పేరుకుపోయిందని నిర్ధారించారు. చికిత్స కోసం కు టుంబసభ్యులు ఉస్మానియాకు తీసుకెళ్లారు. రోగిని పరిశీలించిన డాక్టర్ మధుసూదన్.. రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలు పడిపోతున్నట్టు గుర్తించారు. ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేశ్సాహెతో కలిసి మెడికల్ జర్నల్స్ను తిరగేసి.. పారానియోస్టిక్ సిండ్రో మ్ వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలుసుకున్నారు. ఇలాంటి కేసులు ప్రపంచం లో ఇప్పటివరకు 7 నమోదైనట్టు వైద్యులు తెలిపారు. వాటిలో రెండు కేసులే సక్సెస్ కాగా.. భారత్లో ఇలాంటి కేసు ఇదే మొదటిదని చెప్పారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన దేశంలో లేవని మధుసూదన్ తెలిపారు. రోగి రక్త నమూనాలను అమెరికాకు పంపి నిర్ధారించుకున్నట్టు చెప్పారు. పరీక్షలకు అయ్యే ఖర్చులను ఆయనే సొంతంగా భరించారు.
మూడు విభాగాలు.. ఎనిమిది గంటలు
సర్జికల్ గ్యాస్ట్రో, ఎండోక్రైనాలజీ, అనెస్తీషియా విభాగాల వైద్య బృందాలతో కలిసి డాక్టర్ మధుసూదన్ 8 గంటలపాటు శస్త్రచికిత్స జరిపారు. కాలేయం చుట్టూ ఉన్న 8 కిలోల కణతిని విజయవంతంగా తొలగించారు. కార్పొరేట్లో ఈ శస్త్రచికిత్సకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అవుతుందని మధుసూదన్ తెలిపారు. ఉస్మానియాలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు మధుసూదన్, రాకేశ్సాహె, అనెస్తీషియా విభాగం అధిపతి పాండునాయక్ తదితరులను సూపరింటెండెంట్ నాగేందర్ అభినందించారు.