హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినట్టు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెప్తున్నాయి. జ్వరసర్వే, కొవిడ్ ఓపీ సేవలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్ తదితర కార్యక్రమాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకొన్నాయి. దీంతో ఆదివారం రెండువేలలోపే కొత్త కేసులు నమోదయ్యాయి. సెకండ్వేవ్లో ఏప్రిల్ 7వ తేదీ తర్వాత ఒకరోజులో రెండువేలలోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఖమ్మం, నల్లగొండ మినహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వందలోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతుండటం, రికవరీలు పెరుగుతుండటంతో దవాఖానల్లో బెడ్స్ ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకల్లో 78 శాతం ఖాళీగా కనిపిస్తున్నాయి. సోమవారం నాటికి సాధారణ పడకలు 19,653, ఆక్సిజన్ పడకలు 15,802, ఐసీయూ పడకలు 7,835 మొత్తంగా 43,290 పడకలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ముందు చూపుతో 55వేల పడకల ఏర్పాటు
మొదటి వేవ్ ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పడకలు సిద్ధంచేసింది. సాధారణ పడకలను పెంచి, వేలాది బెడ్స్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు, టీచింగ్ హాస్పిటల్స్లో నాణ్యమైన చికిత్స అందించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు సెకండ్ వేవ్లో జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానల్లో కూడా కొవిడ్ చికిత్సకు అనుమతులిచ్చింది. దీంతో మొత్తంగా 55,442 పడకలు సిద్ధమయ్యాయి. ఇందులో 21,846 సాధారణ పడకలు, 21,751 ఆక్సిజన్ పడకలు, 11,845 ఐసీయూ పడకలున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న రోజుల్లోనూ పేషెంట్లకు ఇబ్బందిలేకుండా అధికారులతో మానిటరింగ్ చేసింది. ఖాళీగా ఉన్న పడకల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసింది. దీంతో అవసరమైన వారికి పడకలు పొందడం సులువైంది. పడకల కొరత అంటూ జరిగే తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయపడకుండా ధైర్యాన్ని నింపింది.
మెజార్టీ శాతం పడకలు ఖాళీ
ముందుచూపుతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పడకల వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడటం సాధ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ పడకలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఎవరూ పడకల కోసం ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి లేదు. పెద్ద నగరాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలతోపాటు జిల్లాల్లోని ద్వితీయ శ్రేణి ప్రైవేటు హాస్పటల్స్కు వచ్చే కరోనా బాధితుల సంఖ్య తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఏపీతో సరిహద్దులున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పది రోజుల క్రితం వరకు గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదైనా కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి.
43వేల పడకలు ఖాళీ
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు 2 శాతం లోపే నమోదవుతున్నది. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గాయి. ప్రభుత్వ విధానాలు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేందుకు కారణమయ్యాయి. జ్వరసర్వే, కొవిడ్ ఓపీ సేవలు, వ్యాక్సినేషన్, నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ మంచి ఫలితాలిచ్చాయి. సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ కలిపి మొత్తం 43 వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. కొద్ది రోజుల్లో వైరస్ ప్రభావం ఇంకా తగ్గుతుంది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి.
-జీ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు